హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అంతులేని కష్ట, నష్టాలకు కారణమైన కరోనాకాలం మానవ సంబంధాల్లోని మరో పాజిటివ్ అంశాన్ని ఆవిష్కరించింది. కష్టకాలంలో దేశ పౌరుల్లో దాతృత్వ స్వభావం, ఇతరులకు సహాయ పడాలనే తపన, సామాజిక సేవా దృక్పథం పెరిగినట్టు చారిటీ ఎయిడ్ ఫౌండేషన్ (సీఏఎఫ్) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆన్లైన్ సర్వే ప్రకారం.. ప్రజల్లో సామాజిక సేవ చేయాలన్న సంకల్పం గతం కంటే 43 శాతం పెరగినట్టు తేలింది. కరోనా వేళ ఎంతమందికి సాయం చేశారు? ఎలాంటి సాయం చేశారు? తదితర వివరాలను సేకరించింది. ఆ సమాచారాన్ని క్రోడీకరించి ‘గివింగ్ ఇండియా 2021’ పేరిట నివేదికను విడుదలచేసింది. దాతల ఉదారతను, అందుకు ప్రేరేపించిన కారణాలను వివరించింది. డబ్బు, వస్తువులు, సామాజిక సేవల రూపంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా 85 శాతం మంది కరోనా బారినపడ్డ పేదలకు బాసటగా నిలిచారని నివేదిక వెల్లడించింది. ముగ్గురిలో ఇద్దరు ధార్మిక, సామాజికసేవకు ఆర్థిక సాయం అందించగా, 10 మందిలో ముగ్గురు తమ స్నేహితులు, బంధువులు, పొరుగువారికి సాయం చేసినట్టు నివేదిక పేర్కొంది. 2019లో విరాళాల సగటు రూ.10,941 కాగా, 2020లో రూ.15,628కి చేరడం దాతృత్వ స్వభావం పెరగడానికి నిదర్శనమని సీఏఎఫ్ నివేదికలో వివరించింది. వరల్డ్గివింగ్ ఇండెక్స్లో 82 నుంచి 14వ స్థానానికి భారత్ ఎగబాకడం ఆల్టైమ్ రికార్డ్ అని వివరించింది.
63% పేదలకు
53% పిల్లలకు
46%మతసంస్థలకు