హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) అమెరికాలో టఫ్స్ యూనివర్సిటీకి చెందిన ద ఫ్లెచర్ స్కూల్తో తన ఒప్పందాన్ని మరో ఐదేండ్లు పొడిగించుకున్నది. మంగళవారం హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ క్యాంపస్లో డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల, ద ఫ్లెచర్ స్కూల్ డీన్ రేచల్ కైట్ మధ్య సహకార ఒప్పందం కుదిరింది. 2027 వరకూ ఇరువురి భాగస్వామ్యం కొనసాగనున్నది. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ రాకేశ్ భారతి మిట్టల్ పాల్గొన్నారు.
ఇదిలావుండగా, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఈపీటీఆర్ఐ), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సంయుక్తంగా ‘వాతావరణ మార్పులు -మానవాళికి ముప్పు-2022’ అనే అంశంపై సమావేశం నిర్వహించాయి. దీనికి రేచల్ కైట్ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పునరుత్పాదక ఇంధనాలను అన్వేషించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ఇరిగేషన్, పర్యావరణశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రజత్కుమార్ అధ్యక్షతన ఈపీటీఆర్ఐలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్, ఆర్థికశాఖ కార్యదర్శి టీ కే శ్రీదేవి, టీఎస్రెడ్కో వీసీ, ఎండీ ఎ జానయ్య, బీఐపీపీ రిసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ అంజల్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.