Summer | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఎండలు మండుతున్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాల్లో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా, మిగతా జిల్లాల్లో 39 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ప్రస్తుతం రికార్డవుతున్న ఉష్ణోగ్రతల కంటే రానున్న ఐదు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. ఎండలపై ఇప్పటికే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశామని చెప్పింది. హైదరాబాద్లోనూ వచ్చే ఐదు రోజులు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నది. ఉదయం పూట మాత్రం పొగ మంచు పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. ఏప్రిల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టు ఇటీవల ‘హీట్ ట్రెండ్స్ ఫర్ హోలీ’ పేరిట ైక్లెమేట్ సెంట్రల్ అనే సంస్థ వెల్లడించింది.
మే ప్రారంభంలో 50 డిగ్రీలకు..
తెలుగు రాష్ర్టాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. మార్చిలోనే మాడు పగిలేరేంజ్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. గత వారం ఏర్పడిన ద్రోణి వల్ల పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడినా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతపురంలో శనివారం దేశంలోనే అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 27 వరకు ఎండ, వేడి, ఉక్కపోత ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ ఆఖరి వారం, మే నెల ప్రారంభంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు.