CM KCR | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఆంగ్ల వార పత్రిక ఇండియా టుడే తాజా సంచికలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్పై కవర్ పేజీ స్టోరీని ప్రచురించింది. ఈ కథనంలో సీఎంతో ఆ పత్రిక సీనియర్ డిప్యూటీ ఎడిటర్ కే అమర్నాథ్మీనన్తో పాటు ఇండియా టుడే గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్ప చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూను కూడా ప్రచురించింది. ‘కెన్ కేసీఆర్ డు ఏ హ్యాట్రిక్?’ శీర్షికతో ప్రచురించిన ఈ కథనంలో.. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కొత్త రాష్ట్రం అయినప్పటికీ అనతికాలంలోనే దేశంలో మరే రాష్ట్రం సాధించని రికార్డులు, ప్రగతిని సీఎం కేసీఆర్ వివరించారు.
ఈసారి ఎన్నికలలో 2018 ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఎక్కువగా, 95-100 సీట్లు సాధించి, హ్యాట్రిక్ కొట్టబోతున్నట్టు కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన విమర్శలు, కుటుంబ పాలనగా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం, ప్రధాని మోదీ తన పర్యటన సందర్భంగా ప్రస్తావించిన అంశాలపైనా మాట్లాడారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలోనే మేటిగా నిలిచిన అంశాలను గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏ స్థితిలో ఉన్నది? తెలంగాణ సిద్ధించాక రాష్ర్టాన్ని తాను ఏ విధంగా తీర్చిదిద్దింది? ఉదాహరణలతో వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్తు ఉత్పత్తి, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, సాగు విస్తీర్ణం పెంపుదలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించామని, ఫలితంగా దక్షిణాదిలో తెలంగాణ ధాన్యాభాండాగారంగా రూపుదిద్దుకున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను వివరిస్తూనే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను కూడా సీఎం కేసీఆర్ తన ఇంటర్వ్యూలో ఎండగట్టారు. ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఆదివారం నాటి నమస్తే తెలంగాణ సంచికలో ప్రచురితం కానున్నది.