హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సాంకేతిక రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల వినియోగంలో ప్రపంచంలోనే భారత్ ముందుంటున్నది. ఒక రకంగా చెప్పాలంటే గ్లోబల్ ఐటీ నిపుణుల హబ్గా దేశం మారింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణుల డిమాండ్ స్థిరమైన వృద్ధిని సాధించిందని, ముఖ్యంగా డిజిటల్ నైపుణ్యాలైన ఏఐ, డాటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్ వంటి టెక్నాలజీ నిపుణులకు భవిష్యత్తులో గణనీయమైన డిమాండ్ ఉన్నదని ‘ఇండియా టెక్ ఇండస్ట్రీ – డిజిటల్ టాలెంట్ డిమాండ్ అండ్ సైప్లె అనాలసిస్-2023’ పేరిట విడుదల చేసిన తాజా నివేదికలో నాస్కామ్ పేర్కొన్నది. డిమాండ్కు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్స్ను ఏర్పాటు చేసి అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రూ.3,517.31 కోట్లను వెచ్చించిందని, దీనిద్వారా ఐటీ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత ఇక్కడి నుంచేనని తెలిపింది.
ఈ స్కిల్ కేంద్రాల్లో శిక్షణ పొందినవారికి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు వివిధ రంగాల్లో పొందేందుకు మార్గం ఏర్పడుతున్నదని, అందులో ప్రధానంగా ఇండస్ట్రీ 4.0, ఏఐ, రోబోటిక్, మెకాట్రానిక్స్, ఐవోటీ, డ్రోన్స్ వంటి రంగాలు కీలకంగా ఉన్నాయన్నది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో వచ్చే మూడేండ్లలో 47 లక్షలమంది యువతకు శిక్షణతోపాటు ఆర్థికంగా సాయం అందుతున్నది. భారత్ నుంచి మహిళా గ్రాడ్యుయేట్లు అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలోనే ఉద్యోగావకాశాలను పొందుతున్నారని, వీరి శాతం 43 నుంచి 48 శాతంగా ఉన్నదని చెప్పింది. మొత్తం 2.5 మిలియన్ గ్రాడ్యుయేట్లు ఇందులో ఉన్నారని నాస్కామ్ ఈ సందర్భంగా తమ నివేదికలో వివరించింది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశంలోని నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు సిద్ధంగా ఉన్నారని, ఇక్కడి ఐటీ రంగంలో పెట్టుబడులు మరింతగా పెరిగేందుకు వీరంతా దోహదం చేస్తారని అభిప్రాయపడింది. మొత్తంగా భారత్.. ప్రపంచానికి డిజిటల్ టాలెంట్ నేషన్గా ఆవిర్భవించనున్నదన్న విశ్వాసాన్ని నాస్కామ్ వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల్లో 5.4 మిలియన్ల ఉద్యోగులున్నారు. అత్యధిక డిమాండ్ ఉన్న టెక్నాలజీల్లో ఏఐ, బిగ్డాటా ఎనలిటిక్స్, ఐవోటీ ఉన్నాయి. అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైయిన్, ఏఆర్, వీఆర్ వంటి టెక్నాలజీలకు భవిష్యత్తులో మరింత డిమాండ్ ఉండనున్నదని అంచనా. ఇక దేశంలో 6 ప్రాంతాలను టెక్నాలజీ హబ్లుగా నాస్కామ్ తమ అధ్యయనంలో గుర్తించింది. అందులో మొదటి స్థానంలో బెంగళూరు, రెండో స్థానంలో హైదరాబాద్ ఉండగా, ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణె తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డిజిటల్ టాలెంట్ సైప్లెలో ఫ్రెషర్స్కు మంచి అవకాశాలున్నాయని, ఇది 2028 నాటికి ప్రస్తుతమున్న డిమాండ్ కంటే రెండు రెట్లు అధికంగా ఉంటుందని నివేదికలో నాస్కామ్ వెల్లడించింది.