Monsoon | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): వేసవి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ నిపుణులు తీపి కబురు అందించారు. ఈ ఏడాది రుతుపవనాలు కాస్త ముందుగానే వచ్చే అవకాశమున్నట్టు పేర్కొన్నారు. ఎన్నడూలేని విధంగా ఈసారి హిందూ మహాసముద్రం డైపోల్ (ఐఓడీ), లానినా పరిస్థితులు ఏకకాలంలో క్రియాశీలకం కానుండటంతో వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండకపోవడాన్ని (ఐఓడీ) అని, మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా చల్లాగా మారటాన్ని లానినా అని అంటారు. ఈ రెండు ప్రక్రియలు ఏకకాలంలో సంభవించడం అత్యంత అరుదైన విషయమని, ఇది నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు.
సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్ మధ్య నమోదయ్యే అత్యధిక వర్షపాతం ఈసారి అంతకన్నా ముందే నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు పశ్చిమ, వాయవ్య భారతంలో ఎక్కువకాలం కొనసాగే అవకాశాలున్నాయని తెలిపారు. దీంతో వర్షపాతం భారీగా ఉంటుందని పేర్కొన్నారు.