హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 15న చారిత్రక గోలొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. పంద్రాగస్టు రోజున ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ జెండాను ఎగురవేస్తారని వెల్లడించారు. గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11:30 గంటలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో ప్రతి రహదారిలో ట్రాఫిక్ నిలిపివేస్తామని చెప్పారు. ప్రతి కార్యాలయం, చారిత్రక ప్రదేశాలు, ఇతర చోట్ల సామూహిక జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు చేశామని వివరించారు. సీఎస్ వెంట వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.
16న సామూహిక గీతాలాపన
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా సామూహికంగా జాతీయ గీతం ఆలపించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నదన్నారు. ఈ వేడుకల్లో భాగంగా 16న సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టంచేశారు.
అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్ వార్డులు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ జంక్షన్లు, విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, జైళ్లు, కార్యాలయాలు, మారెట్ స్థలాలు, గుర్తించిన ఇతర ప్రదేశాల్లో 16వ తేదీ ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించాలని తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆయా ప్రదేశాల్లో నోడల్ అధికారులను నియమించి, మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి స్థానికంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రతి ఒకరూ బాధ్యతగా 16న ఉదయం 11.30 గంటలకు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొని, జాతీయ గీతం ఆలపించే సమయంలో ఎటువంటి శబ్దాలు లేకుండా, అత్యంత క్రమశిక్షణతో ఆలపించాలని సీఎస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సీఎస్ జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేశారు.
16న అన్ని జిల్లాల్లో కవి సమ్మేళనాలు: సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 16న కవి సమ్మేళనాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ శుక్రవారం తెలిపారు. కవి సమ్మేళనాల నిర్వహణపై ఆయన రవీంద్రభారతిలో 33 జిల్లాల డీపీఆర్వోలతో సమాచారశాఖ అడిషనల్ డైరెక్టర్ కే నాగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 16న సాయంత్రం 6 గంటలకు కవి సమ్మేళనాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్ర స్ఫూర్తి-వజ్రోత్సవ దీప్తి’ అంశాన్ని కవితా వస్తువుగా ఎంపిక చేసినట్టు చెప్పారు.
నేడు ఊరూరా జాతీయ స్ఫూర్తి ర్యాలీలు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 13న ఊరూరా జాతీయ స్ఫూర్తి ర్యాలీలను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీలు, మున్సిపాల్టీల్లో విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ జెండాలు, ప్లకార్డులతో ర్యాలీలు చేపట్టనున్నారు.
నేడు ఆర్టీసీ గ్రాండ్ బస్ పరేడ్
వజ్రోత్సవాలను పురస్కరించుకుని టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో శనివారం గ్రాండ్ బస్ పరేడ్ను నిర్వహించనున్నట్టు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ట్యాంక్బండ్ సమీపంలోని రోటరీపార్క్ (మిలిటరీ ట్యాంక్ సమీపంలో) బస్ పరేడ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
వజ్రోత్సవాలకు విస్తృత ప్రచారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్టు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల అధికారులు తెలిపారు. గాంధీ సినిమాను 552 సినిమా థియేటర్లలో తెలుగు, హిందీ భాషల్లో ప్రదర్శిస్తూ 22 లక్షల మంది సూలు పిల్లలకు ఉచితంగా చూపించనున్నట్టు వెల్లడించారు. స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకొంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగ్ల ఏర్పాటుతోపాటు ప్రచార మాధ్యమాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామని ఐ అండ్ పీఆర్ అధికారులు వెల్లడించారు.