హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.2,000 కోట్లు అప్పు కావాలని ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఈ నెల 26న (ప్రతి మంగళవారం) నిర్వహించే ఈ-వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని సేకరిస్తామని పేర్కొన్నది. 26 ఏండ్ల కాలానికి రూ.500 కోట్లు, 28 ఏండ్ల కాలానికి రూ.1,000 కోట్లు, 30 ఏండ్ల కాలపరిమితితో మరో రూ.500 కోట్లు రుణ సమీకరణ కోసం సెక్యూరిటీ బాండ్లు పెట్టింది.
ఈ విషయాన్ని ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద రూ.54,009 కోట్లు సమీకరిస్తామని కాంగ్రెస్ సర్కా రు బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ, ఐదు నెలలు కూడా గడవకముందే ఒక్క ఆర్బీఐ నుంచే ఈ నెల 12వ తేదీ వరకు రూ.31,900 కోట్లు అప్పు తీసుకున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన రుణసమీకరణలో 60 శాతాన్ని ఇప్పటికే దాటేశారు. వచ్చే మంగళవారం ఈ 2,000 కోట్లు కలుపుకుంటే మొత్తం ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణం రూ.33,900 కోట్లు కానున్నది.