హైదరాబాద్ : ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగనున్నది. ఈ క్రమంలో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియానికి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించారు. వీవీఐపీలు, వీఐపీలు గేట్-1 నుంచి స్టేడియంలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కోసం స్టేడియం సమీపంలోని ఏ, సీ వద్ద ఏర్పాట్లు చేయగా.. సీనియర్ పోలీస్ అధికారులకు సైతం గేట్-1 నుంచి ప్రవేశాలు కల్పించనున్నారు. పాసులు కలిగిన వారికి మాత్రమే పాత ఎమ్మారో కార్యాలయం వద్ద పార్కింగ్, 4వేలకుపైగా కార్లు, 5వేలకుపైగా బైక్లు నిలిపేలా స్థలం కేటాయించారు.
ఇదిలా ఉండగా.. ఆదివారం నగరంలో గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో సైబరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఐటీసీ కోహినూర్, ఐకియా, రోటరీ, కేబుల్ బ్రిడ్జి, ఎన్సీబీ జంక్షన్, గచ్చిబౌలి రోడ్డు నంబర్-45, దుర్గంచెరువు, జూబ్లీహిల్స్ ఇనార్బిట్ మాల్, సీవోడీ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు. ఉదయం 8 గంటల తర్వాత సాధరణ రాకపోకలు కొనసాగుతాయని వివరించారు.