Telangana | హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్థిక ప్రగతి గొప్పతనం మరోసారి దేశం ముందు సాక్షాతారమైంది. ‘ఆదాయాన్ని పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అంటూ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పే సూత్రంతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రమే మారిపోయింది. ఫలితంగా అనతికాలంలోనే తెలంగాణ గణనీయ ఆర్థిక ప్రగతిని సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆదాయాన్ని పెంచుకుంటూనే.. మరోవైపు వచ్చిన ప్రతి పైసాను సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల రూపంలో ప్రజలకు పంచుతుండటమే ఇందుకు కారణం. దీంతో తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నదని, దేశాన్ని సాకుతున్న నాలుగైదు రాష్ర్టాల్లో ఒకటిగా నిలుస్తున్నదని 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది రాష్ర్టాల వాటాను విశ్లేషిస్తున్న ఈ నివేదికలో తెలంగాణ పోషిస్తున్న పెద్దన్న పాత్రను, గత తొమ్మిదేండ్లలో ఆర్థికంగా ఎదిగిన తీరును ఆర్బీఐ మరోసారి యావత్ భారతావనికి గుర్తుచేసింది.
జీఎస్డీపీలో అనూహ్య వృద్ధి
అనతికాలంలోనే సుసంపన్న రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ గత తొమ్మిదేండ్లలో అనేక పెద్ద రాష్ర్టాలను అధిగమించింది అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. వయసులో చాలా చిన్న రాష్ట్రమైనప్పటికీ దశాబ్దాల చరిత్ర కలిగిన పలు రాష్ర్టాలకు ఆర్థికవృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. స్వరాష్ట్ర ఏర్పాటు (2014-15) నాటికి రూ.5.05 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ.. గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరినాటికి అనూహ్యంగా రూ.13.3 లక్షల కోట్లకు ఎగబాకింది. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ తిరుగులేని ప్రగతిని చూపుతున్నది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,12,162 కోట్లుగా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,75,443 కోట్లకు పెరిగింది. తద్వారా ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ సుమారు 5 శాతం వాటాను కలిగి ఉన్నది.
జీడీపీలో దక్షిణాది వాటా 30 శాతం
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అభివృద్ధికి దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ విస్తృత తోడ్పాటునందిస్తున్నాయి. దేశ మొత్తం జనాభాలో 19 శాతాన్ని మాత్రమే కలిగివున్న ఈ 5 రాష్ర్టాలు జీడీపీకి ఏకంగా 30 శాతం వాటాను సమకూరుస్తుండగా.. మిగిలిన 25 రాష్ర్టాల వాటా 70 శాతంగా ఉన్నది. అందుకే దేశానికి దక్షిణ భారతావని జీవనాడిగా భాసిల్లుతున్నది. దీన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిపై సవతితల్లి ప్రేమ చూపుతూ ఉత్తరాదికి నిధుల వరద పారిస్తున్నది. అయినా దక్షిణాది రాష్ర్టాలు స్వశక్తితో ఎదుగుతూ ఆర్థికంలో తమదైన పాత్ర పోషిస్తున్నాయి. వాస్తవానికి దక్షిణాదితో పోలిస్తే ఉత్తర భారతావని జనాభాలోనూ, విస్తీర్ణంలోనూ ఎంతో పెద్దవి. వాటిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ర్టాలకు ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్నది. అయినా దేశాన్ని సాకుతున్న రాష్ర్టాల్లో 5 దక్షిణాది రాష్ర్టాలే ముఖ్యపాత్ర పోషిస్తుండటం గమనార్హం.
రుణాలు, వడ్డీ చెల్లింపుల్లోనూ తెలంగాణే ఆదర్శం
రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలు ఆరోగ్యకరంగా ఉన్నాయో లేదో చెప్పేందుకు ఆర్బీఐ ప్రధానంగా జీఎస్డీపీలో రుణాల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నిష్పత్తి ఎంత తక్కువగా ఉంటే ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఉన్నట్టు ఆర్బీఐ పరిగణిస్తుంది. ఈ లెక్కల్లోనో తెలంగాణానే అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం మన రాష్ట్ర జీఎస్డీపీలో రుణాల నిష్పత్తి 25.3 శాతమే. ఇది దేశంలోని మిగిలిన రాష్ర్టాలతో పోలిస్తే చాలా తక్కువ. చివరికి దక్షిణాదిలోని మిగిలిన 4 రాష్ర్టాలు సైతం తెలంగాణ కంటే ఎక్కువ శాతమే రుణాలు తీసుకున్నాయి. కర్ణాటకలో జీఎస్డీపీ-రుణాల నిష్పత్తి 27.5 శాతంగా ఉండగా..
తమిళనాడులో 27.7%, ఏపీలో 32.8%, కేరళలో 37.2 శాతంగా ఉన్నది. మరోవైపు రాష్ర్టాల ఆదాయం-రుణ వడ్డీ చెల్లింపుల మధ్య నిష్పత్తి ఎంత ఉందన్న విషయాన్ని కూడా ఆర్బీఐ తన నివేదికలో పేర్కొన్నది. ఈ నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ర్టాలు అభివృద్ధి పనులకు ఎకువ నిధులు ఖర్చుచేసే స్థితిలో ఉంటాయి. అలా కాకుండా వడ్డీలకే ఎకువ మొత్తాలు చెల్లిస్తే అభివృద్ధి పనులకు తకువ కేటాయింపులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని, వడ్డీలకు అత్యల్పంగా 11.3 శాతాన్ని చెల్లిస్తూ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని ఆర్బీఐ స్పష్టం చేసింది.