హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ): అన్నం తింటే రక్తంలో చక్కెర.. గోధుమలతో చేసిన రొట్టెల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ.. ఇలా ఆహార పదార్థాల్లో పోషకాలపై జరుగుతున్న అధ్యయనాలు భోజనపు అలవాట్లను మారుస్తుండగా.. అందుకు అనుగుణంగా పంటల సాగులో కూడా మార్పులు వచ్చి సంప్రదాయక ఆహార పంటలకు మళ్లీ డిమాండ్ పెరగనుందని పోషకాహార నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీంతో సాధారణ ఆహార పంటలుగా ఉన్న వరి, గోధుమల కంటే అధికంగా రానున్నకాలంలో చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. చిరుధాన్యాల్లో ఉండే పోషక విలువలతో 70 శాతం జనాభాకు అవే ప్రధాన ఆహార వనరుగా మారుతుందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో తేలింది.
మిల్లెట్ల వైపు 70శాతం మంది
భారతీయ ఆహార మూలాల్లో మిల్లెట్లు (చిరుధాన్యాలు)కు అత్యంత ప్రాధాన్యం ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు, మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడినిస్తున్నాయి. వీటి సాగుకు తక్కువ కృత్రిమ ఎరువులు వాడుతుండగా.. నిర్వహణ భారం లేకపోగా.. పుష్కలమైన పోషక విలువలను కలిగి ఉన్నాయి. దీంతో గడిచిన మూడేండ్లుగా వాటి వినియోగం క్రమంగా పెరుగుతున్నది.
భవిష్యత్తుల్లో 70 శాతం మంది తమ ప్రధాన ఆహారంగా మిల్లెట్లను తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కార్బొహైడ్రేట్లు, అధిక చక్కెరనిచ్చే ఆహార పదార్థాలే ఎక్కువగా ఉండగా… క్రమంగా సూక్ష్మపోషకాలు, తక్కువ పిండి పదార్థాలు, అధిక పీచు ఉండే మిల్లెట్ల వైపు జనాలు మొగ్గుచూపుతున్నారని ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడైంది.
80 శాతం ఇండియాలోనే
ఐక్యరాజ్య సమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో మిల్లెట్ల వినియోగంతోపాటు విస్తృతమైన పరిశోధనలకు ఆస్కారం ఏర్పడింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణం గా ఆహారభద్రతను సంరక్షించేలా పంటలలో మిల్లెట్లు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే దశాబ్ద కాలంలో మిల్లెట్ పంటల సాగును పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ పరిశోధన సంస్థలతోపాటు, భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటివరకు ఆసియా దేశాల్లో సాగవుతున్న మిల్లెట్లలో 80 శాతం పంట ఇండియా నుంచే ఉత్పత్తి అవుతుండగా… ప్రపంచ దేశాలకు మిల్లెట్లను అందించే స్థాయికి భారత్ ఎదుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.