Obesity | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు శరీరంలో అనవసరపు కొవ్వులకు కారణం అవుతున్నాయి. దాని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల ప్రజలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఈ మేరకు జాతీయ పోషకాహార సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. తెలుగు రాష్ర్టాలకు చెందిన 10 వేలకు మంది జీవనశైలి, ఆహారపు అలవాట్లను అధ్యయనం చేసిన పరిశోధకులు.. వ్యర్థ కొవ్వులతోనే ఒబెసిటీ పెరుగుతున్నదని తేల్చారు.
హైదరాబాద్తోపాటు, కొన్ని పట్టణాలు, ఏపీలోని కొన్ని పట్టణాల్లో క్రాస్ సెక్షనల్ అధ్యయనం ఆధారంగా ఒబెసిటీ తీవ్రతను పరిశీలించారు. ఇందులో 47 శాతం పట్టణాల్లో, 33 శాతం గ్రామీణ ప్రాంతాల్లో, 20 శాతం ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా స్థూలకాయం ఉన్నదని వెల్లడించారు. వీరిలో హైపర్ టెన్షన్, అధిక బరువు, డయాబెటిస్ వంటి లక్షణాలు కూడా ఉన్నాయని తేలింది. పరిశోధకుడు సమరసింహారెడ్డి ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు.
వయోజనుల్లోనే ఎక్కువ
35 ఏండ్లు వయసు పైబడిన వారిలోనే స్థూలకాయం లక్షణాలు ఉన్నాయని పరిశోధనలో తేలగా, ఆహారపు అలవాట్లలో మార్పులే ఇందుకు కారణమని వెల్లడించారు. మెజార్టీ ప్రజలకు ఆహార సమతుల్యతపై అవగాహన లేదని, అందుకే అధిక బరువు అని గుర్తించారు. పట్టణాల్లో అధిక ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఒబెసిటీకి గురవుతున్నారని తేల్చారు. ఫాస్ట్ ఫుడ్, అధిక చక్కెర, అధిక ఉప్పు కలిగి ఉండే ఇన్స్టంట్ వంటకాలతో పిల్లలు కూడా బాధితులేనని స్పష్టం చేశారు. ఆహారపు అలవాట్లను మార్చుకొంటే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.