ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam) వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం (Rain) కురుస్తున్నది. కొత్తగూడెం, సుజాతానగర్, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, చండ్రగొండ, ఇల్లందు, పాల్వంచ, ములకలపల్లి, బూర్గంపాడు మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.
ఇక రాష్ట్రంలో శుక్రవారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. బంగాళాఖాతం సముద్ర మట్టం నుంచి 4.5 నుంచి 7.6 మి.మీ. ఎత్తు మధ్యలో ఆవర్తనం ఉన్నది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి ఈ నెల 18 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో 18, 19 తేదీల్లో ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 20న కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.