సాగుకోసం రైతుకు ఇవ్వాలని సర్కారు నిర్ణయం
సాధారణం కంటే ఈ విధానంలో అధిక పెట్టుబడి
ఆ భారాన్ని పూర్తిగా భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
అధిక సాంద్రత విధానంలో ఒకేసారి పంటకోత
పంటకాలం తక్కువ.. రెండింతల దిగుబడి
ఒకే కోత
అధిక సాంద్రత విధానం సాగులో పంట మొత్తం ఒకేసారి కోతకు వస్తుంది. ప్రస్తుత విధానంలో రెండుమూడుసార్లు పత్తి తెంపాల్సి ఉంటుంది. ఈ విధానంలో పంట కాలం కూడా తక్కువే. 150-160 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. జూన్-జూలైలో విత్తనాలు వేస్తే నవంబర్-డిసెంబర్ నాటికి పంట మొత్తం చేతికొస్తుంది.
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేసే రైతులకు పెట్టుబడి ఖర్చు కోసం రూ.4 వేల ప్రోత్సాహకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పత్తిలో అధిక దిగుబడులను సాధించడం కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ అధిక సాంద్రత పద్ధతి (చేలో ఎక్కువ మొక్క వేయటం)లో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 30-35 వేల ఎకరాల్లో రైతులతో సాగు చేయించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ప్రోత్సాహకం రూపంలో రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేశారు. తొలిదశలో ఎంపిక చేసి న రైతులతో మాత్రమే సాగు చేయిస్తున్నది. సాధారణ పద్ధతిలో ఎకరాకు 7-8 వేల మొక్కలు ఉంటే, అధికా సాంద్రత పద్ధతిలో 25 వేలకు పైగా మొక్కలు ఉంటా యి. దీంతో సాగు ఖర్చు పెరగుతుంది. విత్తనాలు, కూలీలు, రసాయనాలు.. ఇలా అన్ని ఖర్చులూ పెరుగుతాయి. సాధారణ పద్థతిలో అయితే ఎకరాకు రెండు ప్యాకెట్ల విత్తనాలు సరిపోతాయి. అధిక సాంద్రత పద్ధతిలో ఐదు ప్యాకెట్లు అవసరం. ఒక్కో ప్యాకెట్ ధర రూ.810 చొప్పున రైతులకు ఎకరాకు రూ.2,430 అధికంగా ఖర్చవుతుంది. ఈ విధానంలో మొక్కల పెరుగుదలను నియంత్రించేందుకు గ్రోత్ రెగ్యులేటర్ మెపిక్వాట్ క్లోరైడ్ రసాయనాన్ని రెండుసార్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది.
35 వేల ఎకరాల్లో సాగు
అధిక సాంద్రత విధానంలో పత్తి సాగుపై వరంగల్ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. దీంతో ఈ సీజన్లో రైతులతో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. తొలిదశలో వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో 30-35 వేల ఎకరాల్లో ఎంపిక చేసిన రైతులతో ఈ విధానంలో పత్తిని సాగు చేయిస్తున్నారు. జిల్లాల వ్యవసాయాధికారులు రైతులను ఎంపికచేసి విత్తనాలు అందించి, సాగులో శిక్షణ కూడా ఇచ్చారు. అధికారులు దగ్గరుండి మరీ పంటను సాగు చేయిస్తున్నారు. ఈ విధానం విజయవంతమైతే వచ్చే సీజన్లో సాంద్రత సాగును మరింత విస్తృతం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు.
గ్రోత్ రెగ్యులేటర్ కీలకం
అధిక సాంద్రత పత్తిసాగులో మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగకుండా నియంత్రించడం (గ్రోత్ రెగ్యులేటర్) అత్యంత కీలకం. అధిక ఎత్తు పెరగడం వల్ల మొక్కల మధ్యకు గాలి వెళ్లదు. కాయలకు, నేలకు సూర్యరశ్మి కూడా అందదు. దీంతో గులాబీ రంగు పురుగుతో పాటు ఇతర చీడలు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగకుండా మెపిక్వాట్ క్లోరైడ్ రసాయానాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది. దీన్ని పంట 45 రోజులకోసారి, 60 రోజులకు మరోసారి పిచికారీ చేయాలి. మొదటిసారి పూత దశలో లీటర్ నీటిలో 1.5 మిల్లీలీటర్లు, రెండోసారి కాయ దశలో 2 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
రెండింతల దిగుబడి
సాధారణ పద్ధతితో పోల్చితే అధిక సాంద్రత విధానంలో రెండింతల దిగుబడి వస్తుందని అధికారులు చెప్తున్నారు. వరంగల్ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ప్రయోగ సాగులో హైబ్రిడ్ రకంలో ఎకరాకు 13-15 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణ పద్ధతిలో అయితే 7-8 క్వింటాళ్లకే పరిమితమవుతుంది. నీటి సౌకర్యం ఉన్న చోట ఎకరాకు సుమారు 25 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.