రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టేలా రైతులను చైతన్య పరచాలని, ఇందుకోసం మూడేండ్లలో రూ.36వేల సహాయాన్ని అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో రెండు రోజులుగా దాదాపు 14.30 గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగిన క్యాబినెట్ సమావేశం వివిధ అంశాల్లో 15కు పైగా కీలక నిర్ణయాలు తీసుకొన్నది. ప్రతి ఏటా ఉద్యోగ నియామకాలకోసం జాబ్క్యాలెండర్ రూపకల్పనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తజోన్ల విధానం ప్రకారం జిల్లాలవారీగా పోస్టులను కేటాయించాలని తీర్మానించింది. గురుకులాల్లో స్థానికులకు 50 శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నది. మరోవైపు పట్టణాల్లో ల్యాండ్పూలింగ్ ద్వారా లే అవుట్లు చేయాలని కూడా తీర్మానం చేసింది. వ్యవసాయం అభివృద్ధి, ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్, నూతన పరిశ్రమల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి, లాజిస్టిక్ పాలసీకి ఆమోదం తెలిపింది. మొత్తం ఉద్యోగులు, ఖాళీల సంఖ్యకు సంబంధించిన వివరాలను 5 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించింది.
క్యాబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయిల్పామ్ సాగులో పలు ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేయాలని క్యాబినెట్ సూచించింది. ఆయిల్పామ్ పంటల సాగు విధానం గురించి తెలుసుకోవడానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కోస్టారికా, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియాలలో పర్యటించాలని ఆదేశించింది.
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొన్నది. రానున్న 2022- 23 సంవత్సరంలోగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆయిల్పామ్ పంట నాలుగేండ్లకు చేతికి రానున్న నేపథ్యంలో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు వచ్చే అవకాశమున్నది. దీంతో వారికి పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీ అందజేయాలని నిర్ణయించింది. ప్రతి ఎకరాకు మొదటి సంవత్సరం రూ.26 వేలు, ఆ తరువాత రెండు, మూడు సంవత్సరాలలో రూ.5 వేల చొప్పున సబ్సిడీ ఇవ్వాలని తీర్మానించింది.
క్యాబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయిల్పామ్ సాగుకు అవసరమైన మొక్కల పెంపకానికి పలు ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యంచేయాలని క్యాబినెట్ సూచించింది. వ్యవసాయశాఖతోపాటు అటవీశాఖ, అటవీ అభివృద్ధి కార్పొరేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయంతో ఆయిల్పామ్ మొక్కల నర్సరీలను పెంచాలని తెలిపింది. ఆయిల్పామ్ పంటల సాగు విధానం గురించి తెలుసుకోవడానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కోస్టారికా, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా తదితర దేశాలలో పర్యటించాలని ఆదేశించింది.
అయిల్పామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూయర్ అడ్వాన్స్మెంట్ (టీఐడీఈఏ), తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టీఎస్ఎఫ్పీజెడ్) నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలు అందించాలని అధికారులకు క్యాబినెట్ సూచించింది. రాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి రావడంతో రైతులు ఎక్కువగా వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ధాన్యం ఉత్పత్తి పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో.. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలవైపు రైతులను మళ్లించాలని ప్రభుత్వం భావించింది. ఇందులోభాగంగా ఆయిల్పామ్ పంట సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది.
దేశంలో పామాయిల్కు భారీ డిమాండ్ ఉంది. ఏటా రూ.70-75 వేల కోట్ల విలువైన పామాయిల్ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశ అవసరాలకు ప్రతియేటా 22 మిలియన్ టన్నుల పామాయిల్ అవసరం కాగా మన వద్ద కేవలం ఏడు మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆయిల్ పామ్ను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలి కాలంలో ఆయిల్పామ్ గెల ధర కూడా భారీగా పెరిగింది. ఏడాది కింద క్వింటాలు గెల ధర రూ.9 నుంచి రూ.10వేల మధ్య ఉండగా, ఇప్పుడు రూ.19 వేల వరకు పలుకుతున్నది. ఆయిల్పామ్ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. దీనికి అనుబంధంగా ఆయా జిల్లాల్లో కంపెనీల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికి తొమ్మిది కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ కంపెనీలు వాటికి కేటాయించిన జిల్లాల్లో త్వరలోనే పరిశ్రమలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.