హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): నది నుంచి మళ్లించే ప్రతి నీటిబొట్టునూ లెక్కించాల్సిందేనని, తద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలంగాణ తరపు సాక్షి, సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్ పండిత్ చెప్పారు. ఈ మేరకు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాల పంపిణీ, ఆపరేషన్ ప్రొటోకాల్ ఏర్పాటుపై చేపట్టిన బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్-2 విచారణ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తాళపత్ర నేతృత్వంలో ఢిల్లీలో బుధవారం పునఃప్రారంభమైంది. చేతన్పండిత్ను ఏపీ సీనియర్ న్యాయవాది ఉమాపతి పలు అంశాలపై క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఏపీ లేవనెత్తిన అంశాలకు ఆపరేషనల్ ప్రొటోకాల్ ఫ్రేమ్వర్క్ జాతీయ నీటి విధానాలు, ఎన్డబ్ల్యూడీఏ అధ్యయనాలను ఉటంకిస్తూ చేతన్పండిత్ దీటుగా సమాధానమిచ్చారు.
ముఖ్యంగా నదీజలాల కేటాయింపులో ఇన్ బేసిన్ వినియోగాలకు ప్రాధాన్యమివ్వాలని ప్రతిపాదించారు. తెలంగాణలో 63.25% విస్తీర్ణం కృష్ణా బేసిన్లో ఉన్నప్పటికీ అక్కడ కరువుగా ఉన్నదని, గతంలో ఏపీ 331 టీఎంసీల నీటిని బయట బేసిన్కు మళ్లించిందని, లోటు పరిస్థితులు ఉన్నప్పుడు, బేసిన్ లోపల ఉన్న ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డ్యా మ్ల మీదుగా స్పిల్లింగ్ సమయంలో, బేసిన్ సరిహద్దుతో సంబంధం లేకుండా నీటిని మళ్లించడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉన్నదని, అయితే ఆ మళ్లింపులను బేసిన్లో వాడుకోవడానికేనని, ఆ నీటిని బేసిన్ వెలుపల ఉపయోగించరాదని స్పష్టంచేశారు. రిజర్వాయర్లు నిం డిన అనంతరం మళ్లిస్తున్న నీటిని కేఆర్ఎంబీ లెక్కించడం లేదని, దీన్ని నిర్ణయించే అధికా రం బోర్డులకు లేదని, అందులో ట్రిబ్యునల్దే తుది అధికారమని స్పష్టం చేశారు. మళ్లించే నీటిని రాష్ర్టాల వాటా కింద లెకించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. ట్రిబ్యునల్ కేటాయించిన 150 టీఎంసీల క్యారీ ఓవర్ స్టోరేజీని 125:25 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీలు పంచుకోవాలని స్పష్టంచేశారు.
నేడు ‘పాలమూరు రంగారెడ్డి’పై విచారణ
వ్యవసాయం, ఇంజినీరింగ్, ఆపరేషన్ ప్రొటోకాల్ అంశాలపై ఏపీ తరపున సాక్షులైన ముగ్గురు నిపుణులను, తెలంగాణకు చెందిన ముగ్గురు నిపుణుల క్రాస్ ఎగ్జామినేషన్ బుధవారంతో ముగిసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 246పై స్టే విధించాలని కోరుతూ ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ కొనసాగనున్నది. ఏపీ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు, కౌంటర్ రిప్లయ్ ఇవ్వడానికి ఏపీకి రెండు వారాల గడువు ఇచ్చారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ రిప్లయ్ను దాఖలు చేసింది. ట్రిబ్యునల్ విచారణకు తెలంగాణ నుంచి సీనియర్ న్యాయవాదులు వీ రవీందర్రావు, ఆర్కే రెడ్డి, ఎస్ఈ కోటేశ్వర్రావు, ఈఈ హైడ్రాలజీ విజయకుమార్, ఈఈ కృష్ణ, ఎస్ విజయకుమార్, డీఈఈ జీ నాగేశ్వరరావు, ఏఈఈలు రయీజ్ మీర్జా, దాదా కలంధర్, అనురాగ్ శర్మ తదితరులు హాజరయ్యారు.