ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 14: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆకాంక్షించారు. ఉస్మానియా యూనివర్సిటిలో నెలకొల్పిన సివిల్స్ అకాడమీని బుధవారం ఆయన పలువురు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థులు అదృష్టవంతులని, రాష్ట్రపతి ఉత్తర్వుల వలన తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనూ స్థానిక విద్యార్థులకు 95% రిజర్వేషన్లు లేవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు లక్ష కొలువులు భర్తీ చేయనున్న నేపథ్యంలో విద్యార్థులంతా కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీల్లో విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న తన ప్రతిపాదనను ఓయూ అమలుచేయడం సంతోషంగా ఉన్నదని చెప్పారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల కలలను నిజం చేసేలా చొరవ తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఓయూ అధికారులను అభినందించారు. విద్యార్థులు 24 గంటలూ పోటీపరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా గ్రంథాలయం, సెక్యూరిటీ, వైఫై, ఇతర వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మెళకువలు నేర్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి తరగతులు తీసుకుంటానని అభయమిచ్చారు. ఓయూలో చదివి, తనతోపాటు కీలక పదవిలో పనిచేస్తున్న బుర్రా వెంకటేశం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఓయూ సివిల్స్ అకాడమీకి వారం వారం ఒక ఉన్నతాధికారి వచ్చి పాఠాలు చెప్తారని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భర్తీచేయనున్న ఉద్యోగాల కోసం పోటీపడి చదవాలని సూచించారు. విద్యార్థులు సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా పోటీపరీక్షలకు సన్నద్ధం కావాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు. కష్టపడి చదవి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తాను ఓయూలోని ఈ-1 హాస్టల్లో ఉంటూ ఐఏఎస్ సాధించానని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
ఓయూ విద్యార్థుల మేధస్సు అత్యున్నతమని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కొనియాడారు. విద్యార్థులు గొప్పగా ఆలోచించాలని, తమ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలని సూచించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు వస్తున్నాయని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఏ ప్రభుత్వమూ ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా శిక్షణ అందించలేదని, తెలంగాణలో ప్రజాప్రతినిధులే 130 కోచింగ్ సెంటర్లను ఉచితంగా నడుపుతున్నారని ప్రశంసించారు.
వర్సిటీ స్థాయి విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు కేవలం కానిస్టేబుల్, టీచర్ ఉద్యోగాల ప్రిపరేషన్కే పరిమితం కావడాన్ని గుర్తించి, సివిల్ సర్వీసెస్ అకాడమీ స్థాపించాలనే ఆలోచన వచ్చిందని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ వివరించారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు సీఈవోలుగా, యజమానులుగా ఓయూ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ చింత గణేశ్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.