Minister Harish Rao | రంగారెడ్డి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేసి, ఉద్యోగాలు, ఉపాధి, ధనం సృష్టిస్తూ సంపద పెంచుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పలు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ధరలు పెంచుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ధనం పెంచేటోళ్లు కావాలా? ధరలు పెంచేటోళ్లు కావాలా? అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో రూ.72.21 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి గురువారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో హరీశ్రావు మాట్లాడారు. ‘బాయికాడ మోటర్లకు మీటర్లు పెడతామని బీజేపీ అంటుంటే.. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తు చాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కేసీఆర్ మాత్రం మూడు పంటలు పండియ్యాలి అంటున్నరు. మీటర్లు కావాలా? 3 గంటల కరెంటు కావాలా? మూడు పంటలు కావాలా? ఆలోచించాలి’ అని కోరారు. మహేశ్వరానికి మంజూరైన మెడికల్ కాలేజీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానను వంద పడకలకు అప్గ్రేడ్ చేస్తూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు.
కర్ణాటకలో 8 గంటలైనా కరెంటు రావట్లే
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి రైతులకు 8 గంటల కరెంటు ఇవ్వడం లేదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. బెంగళూరులో నాలుగు గంటలే ఇస్తున్నారని, పరిశ్రమలకు కూడా కరెంటు కోత ఉన్నదని తెలిపారు. రైతుల పాలిట నల్ల చట్టాలు తెచ్చి బీజేపీవాళ్లు పాపంగా మారితే, మూడు గంటల కరెంటు చాలు అంటూ కాంగ్రెస్వాళ్లు శాపంగా మారారని మండిపడ్డారు. దీపం లాంటి కేసీఆర్ ఉండగా.. పాపం లాంటి బీజేపీ, శాపం లాంటి కాంగ్రెస్ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే సూట్ కేసుల్లో నాలుగైదు డ్రస్సులు పెట్టుకుని వచ్చే నేతల మాయలో పడవద్దని, ప్రజలకు సేవ చేసేవారినే ఆదరించాలని ప్రజలకు సూచించారు.
వైద్య రంగానికి పెద్దపీట
వైద్య రంగానికి పెద్దపీట వేసి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని హరీశ్రావు తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్గా ఉన్న తెలంగాణ, వైద్యుల ఉత్పత్తిలోనూ నంబర్ వన్గా మారి దేశానికే సేవలు అందించే స్థాయికి ఎదిగిందని అన్నారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని చెప్పారు.
నాగిరెడ్డిపల్లిలో ఐటీ హబ్
రంగారెడ్డి జిల్లా నాగిరెడ్డిపల్లిలో ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్తో మాట్లాడి దీనిని సాకారం చేసే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఐటీ రంగం అభివృద్ధి చెందితే ఉద్యోగావకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, బీఆర్ఎస్ నేతలు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్రెడ్డి, క్యామ మల్లేశ్, కార్తీక్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ ఛైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
వీఏవో, ఆర్పీల వేతన పెంపుపై వారంలో ఉత్తర్వులు
స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్న వీఏవోలను గత ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదని, వారికి ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీశ్రావు తెలిపారు. వీఏవోల రెన్యూవల్ను ఆటోమెటిక్గా చేసి.. ఇన్సూరెన్స్, వేతనం పెంపు వంటి సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వీరితోపాటు ఆర్పీల సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, వేతనం పెంపుకు సంబంధించిన ఉత్తర్వులను వారంలోగా జారీ చేయనున్నట్టు తెలిపారు. రూ.20 వేల కోట్లతో రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని, 15 రోజుల్లో రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు.
రామోజీ ఫౌండేషన్ సేవలు భేష్
రంగారెడ్డి, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): రామోజీ ఫౌండేషన్ రూ.4.5 కోట్లు వెచ్చించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్డీవో, అబ్దుల్లాపూర్మెట్లో తహసీల్దార్ కార్యాల భవనాలను నిర్మించింది. వాటిని గురువారం మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విపత్తుల సమయంలో బాధితుల పక్షాన నిలవడంలో, ప్రజలను ఆదుకోవడంలో ఈనాడు, ఈటీవీ సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దవాఖాన నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు ప్రభు త్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఈనాడు ఎండీ కిరణ్, రామోజీ ఫిల్మ్సిటీ ఎండీ విజయేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.