(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా పరిగణించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) కేంద్రంలోని బీజేపీ సర్కారు నుంచి ఆశించినంత ప్రోత్సాహం దక్కట్లేదు. ఏటికేడాది వేలాది కంపెనీలు మూతపడుతున్నాయి. గడిచిన మూడేండ్లలో దేశవ్యాప్తంగా 19,687 ఎంఎస్ఎంఈలు మూతబడ్డాయి. గత ఏడాదిలోనే ఏకంగా 13,290 పరిశ్రమలను మూసేశారు. ఈ మేరకు ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం పార్లమెంట్లో సమాధానమిచ్చింది. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు నిర్ణయాలు ఎదురుదెబ్బగా మారినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, కంపెనీల మూసివేతకు సంబంధించి పార్లమెంట్కు కేంద్రం సమర్పించిన లెక్కలు తప్పు అంటూ విపక్ష నేతలు మండిపడుతున్నారు. గత తొమ్మిదేండ్లలో దాదాపుగా 10 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు మూతపడినట్టు పేర్కొన్నారు.