Congress | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): అనుకున్నదే అయింది.. ఒకటి రెండు రోజుల క్రితం పార్టీలో చేరిన నేతలకే పెద్దపీట వేసిన కాంగ్రెస్ అధిష్ఠానం బీసీ నేతలను పక్కకు నెట్టింది. ఈ దెబ్బతో పార్టీలో బీసీలకు దిక్కూదివాణం లేదన్న విషయం మరోమారు తేటతెల్లమైంది. బీసీ నేతల్లో కాస్తోకూస్తో ఉన్న నమ్మకాన్ని శుక్రవారం పార్టీ పెద్దలు పూర్తిగా తుడిచేశారు. 45 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ అందులో 8 అంటే 8 మంది బీసీ నేతలకు మాత్రమే చోటిచ్చింది. ఇలా వచ్చి అలా కండువా కప్పుకున్న 19 మంది ప్యారాచూట్ నేతలకు మాత్రం వచ్చిందే లేటన్నట్టు సీట్లు కేటాయించింది. తొలి జాబితాలో 12 మంది బీసీ నాయకులకు సీట్లు ఇచ్చినప్పటికీ అందులో చాలావరకు ఓడిపోయే స్థానాలే ఉండటం గమనార్హం. మొత్తంగా ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ అందులో 20 మంది బీసీలకు మాత్రమే చోటిచ్చింది. బీసీ నేతలైన మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్కు సీట్లు కేటాయించి చేతులు దులుపుకున్నది.
కొత్తవారి కోసం పాత నేతల బలి
కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించిన 100 స్థానాల్లో 30 మంది కొత్తవారే ఉండడంతో పార్టీ నేతలు రగిలిపోతున్నారు. కష్టపడి పనిచేస్తే టికెట్లు ఇస్తామని నమ్మించి ఇప్పుడీ నమ్మక ద్రోహం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తవారి కోసం తమను బలిచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్ పక్కా అని ఆశలు పెట్టుకున్న వారు ఇప్పుడు తమ పేరు ఉండాల్సిన స్థానంలో మరో నేత పేరు ఉండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
పార్టీ సేవకు దక్కిన ఛీత్కారం
పార్టీ కోసం ఏండ్ల తరబడి సేవ చేస్తున్న వారికి కాకుండా నిన్నమొన్న వచ్చిన వారికి పార్టీ అధిష్ఠానం టికెట్లు కేటాయించింది. రెండు రోజుల క్రితం పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బండి రమేశ్, మెన్నం శ్రీనివాస్రెడ్డి వంటివారికి టికెట్లు కేటాయించింది. పార్టీలో ఏండ్ల తరబడి ఉన్నా సీటు దక్కని నేతల్లో విష్ణువర్ధన్రెడ్డి, బల్మూరి వెంకట్, అంబర్పేట నుంచి లక్ష్మణ్యాదవ్, నూతి శ్రీకాంత్, ఎల్లారెడ్డి నుంచి సుభాష్రెడ్డి, ఎల్బీనగర్ నుంచి మల్రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్, హుస్నాబాద్ నుంచి అలిరెడ్డి ప్రవీణ్రెడ్డి, ఆదిలాబాద్ నుంచి గండ్ర సుజాత, షాజీద్ఖాన్, ఆసిఫాబాద్ నుంచి సరస్వతి, మక్తల్ నుంచి ఎర్ర శేఖర్, వనపర్తి నుంచి శివశంకర్రెడ్డి, మేఘారెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, పరకాల నుంచి గాజర్ల అశోక్, మునుగోడు నుంచి పాల్వాయి స్రవంతి, చెలమల కృష్ణారెడ్డి, పున్నా కైలాశ్నేత, పినపాక నుంచి సూర్యం, వరంగల్ వెస్ట్ నుంచి జంగా రాఘవరెడ్డి, మహేశ్వరం నుంచి పారిజాతరెడ్డి వంటి వారు ఉన్నారు.
రగిలిపోతున్న అసంతృప్త నేతలు
అభ్యర్థుల రెండో జాబితా కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తున్నది. పెద్దగా పోటీ లేని తొలి జాబితా ప్రకటించినప్పుడే అంత రచ్చ జరిగితే ఇప్పుడిక గాంధీభవన్కు తాళం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కొందరు కీలక నేతలు పార్టీని వీడేందుకు కూడా సిద్ధపడుతున్నట్టు తెలిసింది.
కొత్తగా పార్టీలో చేరి టికెట్ పొందిన నేతలు
ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్రెడ్డి
ముదోల్- నారాయణరావ్ పాటిల్
నిజామాబాద్ రూరల్- భూపతిరెడ్డి
హుజూరాబాద్- ఒడితెల ప్రణవ్
కూకట్పల్లి- బండి రమేశ్
శేరిలింగంపల్లి- జగదీశ్వర్గౌడ్
తాండూర్- మనోహర్రెడ్డి
ఆసిఫాబాద్ – అజ్మీరా శ్యామ్నాయక్
కంటోన్మెంట్- వెన్నెల
మహబూబ్నగర్- మెన్నం శ్రీనివాస్రెడ్డి
మునుగోడు – రాజగోపాల్రెడ్డి
భువనగిరి- కుంభం అనిల్ కుమార్రెడ్డి
పాలకుర్తి- యశస్విని
మహబూబాబాద్- మురళీ నాయక్
పరకాల- రేవూరి ప్రకాష్రెడ్డి
వర్ధన్నపేట- కేఆర్ నాగరాజు
ఖమ్మం- తుమ్మల నాగేశ్వర్రావు
పాలేరు- పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
పినపాక- పాయం వెంకటేశ్వర్లు
బోథ్- వెన్నెల అశోక్
పార్టీలో ఏండ్లుగా ఉండి టికెట్లు దక్కని నేతలు
జూబ్లీహిల్స్ – విష్ణువర్ధన్రెడ్డి
హుజూరాబాద్- బల్మూరి వెంకట్
అంబర్పేట- లక్ష్మణ్యాదవ్, నూతి శ్రీకాంత్
ఎల్లారెడ్డి- సుభాష్రెడ్డి
ఎల్బీ నగర్- మల్రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్
హుస్నాబాద్- ప్రవీణ్రెడ్డి
సిద్దిపేట- భవానీరెడ్డి
ఆదిలాబాద్- గండ్ర సుజాత, షాజీద్ఖాన్
ఆసిఫాబాద్- సరస్వతి
మక్తల్- ఎర్ర శేఖర్
వనపర్తి- శివశంకర్రెడ్డి, మేఘారెడ్డి.
మహబూబాబాద్- బలరాంనాయక్
పరకాల- గాజర్ల అశోక్
మునుగోడు- పాల్వాయి స్రవంతి, చెలమల కృష్ణారెడ్డి, పున్నా కైలాశ్నేత
పినపాక- సూర్యం
వరంగల్ వెస్ట్- జంగా రాఘవరెడ్డి
మహేశ్వరం- పారిజాతరెడ్డి
వరంగల్ తూర్పు- ఎర్రబెల్లి స్వర్ణ
బోథ్- నరేశ్ జాదవ్, ఆడే గజేందర్
పొద్దున చేరితే సాయంత్రం టికెట్ ఇస్తారా
పొద్దున చేరిన నేతలకు సాయంత్రం టికెట్ ఇస్తే.. ఐదేండ్లు పార్టీ జెండా ఎందుకు మోయాలి? పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పే నైతిక హక్కును కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది.
-జీ నిరంజన్, టీపీసీసీ నేత