హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): కేంద్రం ప్రభుత్వం ధరలు పెంచడంలో చూపుతున్న ఉత్సాహం, శ్రద్ధ ఉపాధిహామీ కూలీరేట్లు పెంచటంలో చూపటం లేదు. కూలీరేట్లను తూతూమంత్రంగా పెంచి చేతులు దులిపేసుకుంటున్నది. కనీసం వేతనాల చట్టాన్ని కేం ద్రం తుంగలోతొక్కింది. ఉపాధిహామీని నిర్వీ ర్యం చేయాలనే తలంపుతో ఇప్పటికే బడ్జెట్లో ఉపాధిహామీకి గణనీయంగా నిధుల కేటాయింపులో కోత పెట్టింది. తాజాగా కూలీరేట్లలో కూలీలకు తీవ్ర అన్యాయం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రోజుకు గరిష్ఠంగా రూ.272లు చెల్లించాలని నిర్ణయించారు. కనీసవేతనాల చట్టం ప్రకారం రేట్లు నిర్ణయిస్తే అదనంగా మరో రూ.100 వరకు రేట్లు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ, కూలీరేట్లు పెంచటానికి కేంద్రానికి చేతులు రావటంలేదు. రోజు మొత్తం కష్ట పడినా ప్రస్తుతం రూ.257 గరిష్ఠంగా ఇస్తున్నారు. ఇంత మొత్తం కూడా కూలీలకు ఏనాడు వచ్చిన దాఖలాలు లేవు. ఈ సంవత్సరమైనా కూలీల రోజు వారి ఖర్చులకు సరిపోను కూలీ గిట్టుబాటు అయ్యే విధంగా రేటు నిర్ణయిస్తారని అనుకున్నా…నిరాశే మిగిలింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ కూలీరేట్లు రూ.272గా నిర్ణయించారు. ఈ మొత్తం ఉత్తరాది రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉన్నది. ఉపాధిహామీ పనులు అంటేనే ఆసక్తి లేకుండా చేస్తున్నారు. దీంతో పరోక్షంగా ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.
కనీసవేతనాల చట్టం అమలు ఏదీ?
వ్యవసాయ కూలీలు, భవననిర్మాణ రంగ కార్మికులు చేసే పనులు, ఇతర పనుల్లో వేటికి వెళ్లినా రోజుకు కనీసం రూ.600-800 వరకు ఇస్తున్నారు. కానీ అందులో సగం కూడా కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ కూలీకి చెల్లించటం లేదు. కేంద్రం విధించిన నిబంధనల కారణంగా కూలీ పనులకు వచ్చే వారి సంఖ్య తగ్గడం, మరో వైపు పనికి వచ్చే వారికి కూలీ మొత్తం కూడా తగ్గుతున్నది. గత ఐదు సంవత్సరాల లెక్కలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతున్నది. కేంద్రం రూపొందించిన కనీసవేతనాల చట్టం ప్రకారం ఉపాధిహామీ కూలీలకు కూలీ మొత్తాన్ని నిర్ణయించాలని గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధిహామీ చట్టం నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం నిర్ణయించిన కూలీరేట్లపై ఎక్కడా పారదర్శకత పాటించటంలేదని ఉపాధిహామీ చట్టంపై పనిచేస్తున్న సంస్థలు, నిపుణులు విమర్శలు చేస్తున్నారు.