నమస్తే నెట్వర్క్, మే 5: ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఆదివారం పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన జనాన్ని అతలాకుతలం చేసింది. పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాత పడ్డారు. విద్యుత్తు స్తంభాలు నెలకొరిగి అంతరాయం ఏర్పడింది. ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. పలుచోట్ల ధాన్యం తడిసింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలి రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయిపల్లి, క్రాస్ రోడ్డు, తాళ్లగడ్డలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వడగండ్ల వాన కురిసింది. మండల కేంద్రానికి చెందిన రైతు బాస బుల్లయ్య మిర్చి కల్లం వద్దకు వెళ్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. మంగపేట మండలంలో భారీ వర్షం కురిసింది. తాడ్వాయి మండలంలోని దామరవాయిలో చేతికొచ్చిన వరి పంటలు నేలకొరిగాయి. కాటాపురం, మంగపేట దారిలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో ఆరబోసిన మక్కజొన్న, ధాన్యం తడిశాయి. నర్సింహులపేట మండలంలో మంగిమడుగులో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయింది. రామన్నగూడెం, ముంగిమడుగు, ఫకీరు తండా, నరసింహపురం బంజరలో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరులో పిడుగుపాటుకు దాసరి అజయ్ (24)తో పాటు రెండు పశువులు మృతి చెందాయి. స్టేషన్ఘన్పూర్, చిల్పూర్, దేవరుప్పులలో పిడుగులు పడి రెండు పశువులు మృతి చెందాయి. చిన్నగూడురు మండలంలో రాళ్ల వాన పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వాన పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తిలో పిడుగుపాటుకు వ్యక్తి చనిపోయాడు. ఒక బర్రె మృతి చెందింది. గుండాల మండలం తుర్కలషాపురం ఒక బర్రె, వలిగొండ మండలం వెంకటాపురంలో ఒక ఆవు, సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జలో రెండు ఆవులు, ఆత్మకూర్ (ఎం) మండలం పారుపల్లిలో ఒక ఎద్దు, నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడుతపల్లిలో ఆవు పిడుగుపాటుకు మృతిచెందాయి. వర్షంతోపాటు వాతావరణం చల్లబడగా ఎండ వేడిమి నుంచి జనం ఉపశమనం పొందారు.