Telangana | ఇటు ఆరుగురు మంత్రులు శ్రీధర్బాబు, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అటు ఒకే ఒక్కడు హరీశ్రావు.. ఇటు కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. అధికారుల అండదండలు, అటు విపక్ష స్థానం, మాజీ ఆర్థిక మంత్రి.. అడుగడుగునా అధికార పక్షం అడ్డంకులు, అభ్యంతరాలు.. అయితేనేం హరీశ్రావు వేసిన సాధికారిక ప్రశ్నలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం తెల్లబోయింది. మీ రాజకీయ పగ సాధించడానికి తెలంగాణను బలిచేస్తారా? తెలంగాణ దివాళా తీసిందంటే రేపు ఇక్కడికి పరిశ్రమలు వస్తాయా..? పెట్టుబడిదారులు వస్తారా? హామీలు అమలుచేయలేని మీ అశక్తతను కప్పిపుచ్చుకోవడానికి శ్వేతపత్రాల పేరుతో కోత పత్రాలు, ఎగవేత పత్రాలు అంటూ గణాంకాలతో సహా ఇచ్చిన వివరణకు, అడిగిన ప్రశ్నలకు అధికార పక్షం తడబాటుకు గురైంది. హరీశ్ తర్వాత మాట్లాడిన మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆర్థిక శ్వేతపత్రంలోని డొల్లతనాన్ని, లొసుగులను అంకెల మధ్య పొంతన లేకపోవడాన్ని ఎండగట్టారు.
హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర చిట్టా పద్దుల ఆవర్జాను శ్వేతపత్రంతో బయటపెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్చలో చివరకు తానే తెల్లబోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత పాలకులు భ్రష్టు పట్టించారనే వ్యూహంతో లేవనెత్తిన అనేక అంశాలను విపక్ష పార్టీలు తూర్పారబట్టాయి. తాము రిక్తహస్తాలతో ఉన్నామని, తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో జాప్యం జరుగుతుందన్న సంకేతాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వదలచుకున్నదా? అంటే బుధవారం సభలో జరిగిన పరిణామాలు అవుననే అంటున్నాయి.
బుధవారం సభ సమావేశం ప్రారంభం కాగానే ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ శాససనభాపక్ష నేతగా కూనంనేని సాంబశివరావును సభ గుర్తించినట్టు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత మరణించిన మాజీ శాసనసభ్యులు రామన్నగారి శ్రీనివాస్రెడ్డి, కొప్పుల హరీశ్వర్రెడ్డి, కుంజా సత్యవతికి సభ్యులు ఘన నివాళి అర్పించారు. అనంతరం సభ్యులకు శ్వేతపత్రం ప్రతులను అందజేశారు. ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అంశాలను ప్రస్తావించకుండానే లఘు చర్చను విపక్షాలకు ఇచ్చారు. స్పీకర్ ప్రసాద్కుమార్ సభలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. హరీశ్రావు లేచి ఇంతపెద్ద శ్వేతపత్రం ఇచ్చి నాలుగు నిమిషాలైనా కాకముందే చర్చ పెట్టడం 5వ పేజీలో సరికాదని, 47 పేజీల పుస్తకాన్ని చదివేందుకు సమయం ఇవ్వాలని కోరారు. సభ్యుల కోరిక మేరకు అరగంట తేనీటి విరామం అనంతరం సభ ప్రారంభమైంది.
తేనీటి విరామం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో, గతపాలనపై బురద జల్లే ఉద్దేశంతో ప్రభుత్వం తప్పుల తడకగా శ్వేతపత్రాన్ని విడుదల చేసిందని ఆరోపించారు. ఆయన మాట్లాడుతున్న క్రమంలో సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనేక పర్యాయాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెండుసార్లు హరీశ్రావు మైక్ కట్ చేశారు. రెండు సందర్భాల్లో బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. సభను ఆర్డర్లో పెట్టిన అనంతరం తిరిగి స్పీకర్ హరీశ్రావుకు అవకాశం కల్పించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, చేసిన అప్పుల నేపథ్యాన్ని హరీశ్రావు సాధారికారికంగా సభ ముందు ఉంచారు. ఆ తరువాత ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ శ్వేతపత్రంపై విరుచుకుపడ్డారు.
అందులో పేర్కొన్న అంశాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని మండిపడ్డారు. గడచిన 57 ఏండ్ల బడ్జెట్ రూ.11 లక్షల కోట్లు అయితే తెలంగాణ పదేండ్లలో రూ.12 లక్షల కోట్లు అని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రమే తేల్చిచెప్పిందని ఉదహరించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీయకూడదని సూచించారు. తర్వాత బీజేపీ నుంచి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అలవి కాని హామీలు ఇచ్చి అప్పుల పేరుతో ఆరు గ్యారెంటీలను విస్మరించకూడదని హెచ్చరించారు. సీపీఐ సభాపక్ష నేత కూనంనేని సైతం తప్పులను మాత్రమే ఎత్తిచూపుతాం. కాంగ్రెస్ నుంచి రేవూరి ప్రకాశ్రెడ్డి, మదన్మోహన్రావు మాట్లాడారు. తర్వాత భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేయటంలోని ఆంతర్యాన్ని బయటపెట్టారు. దీనికి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, కేపీ వివేకానంద, కౌశిక్రెడ్డి సహా పలువురు తీవ్రంగా ఆక్షేపించారు. క్లారిఫికేషన్ సమయంలోనూ బీఆర్ఎస్ సభ్యులు సర్కారును ఇరునపెట్టారు. మొత్తంగా బుధవారం అసెంబ్లీ సమావేశం ఆర్థిక శ్వేతపత్రంతో అధికార కాంగ్రెస్ పార్టీ‘హస్త’కుతలమైంది. సభ గురువారం ఉదయం 11 గంటలకు వాయిదాపడింది.
శ్వేతపత్రంలోని లెక్కలకు కాగ్, ఆర్బీఐ, బడ్జెట్ లెక్కలకు ఏ మాత్రం పొంతన లేదు. శ్వేతపత్రంలో అన్నీ తప్పుడు లెక్కలు చూపి సభను పక్కదోవ పట్టిస్తున్నారు. లెక్కలు తప్పని తేలితే.. ఈ లెక్కలు అందించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. రాజకీయం కోసం రాష్ట్రం పరువు తీయొద్దు. రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ ప్రచారం చేసి.. ఒక బీమారీ రాష్ట్రంగా చూపించొద్దు. ప్రపంచానికి రాష్ట్రంపై తప్పుడు మెసేజ్ వెళితే అది తీరని నష్టం చేస్తుంది.
– అక్బరుద్దీన్ ఒవైసీ, మజ్లిస్ పక్షనేత
ఈ రోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణం.. స్టేట్ ఏదో డెఫిసిట్లోకి పోతుందని, రాబోయే కాలంలో ఏం చేయలేని పరిస్థితులో ఉందని, ఈ రోజు ఆర్థిక పరిస్థితులు బాగాలేవని గ్లోబల్ లెవల్లో ఫోకస్ చేయడానికి కాదు. ఇది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వపు 10 ఏండ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే. అప్పులు చేయనిదే ఏ రాష్ట్రమూ ముందుకు పోదు. అప్పులు సరైన విధానంలో ఖర్చు పెట్టారో లేదో రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం పెట్టాం.
– మంత్రి శ్రీధర్బాబు