హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అంటూ ప్రధాని మోదీ ఇస్తున్న నినాదాలన్నీ గాలిలోనే కలిసిపోతున్నాయి. మాటలు కోటలు దాటుతున్నా కాలు గడప దాటని పరిస్థితి. కేంద్ర పథకాలన్నీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగానే మిగులుతున్నాయి. ప్రధాన రంగాలకు, పేదల సంక్షేమానికి నిధుల కేటాయింపుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిసారీ మొండిచెయ్యి చూపుతున్నది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ, పేదలకు, రైతాంగానికి ప్రాధాన్యమిస్తున్నది. అందుకు 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలే తాజా నిదర్శనం. తెలంగాణ బడ్జెట్ మొత్తంగా రూ.2,90,396 కోట్లు కాగా, అందులో సింహభాగం గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, సంక్షేమ రంగానికే దాదాపు 1,80,201 (62.05%) కోట్లు కేటాయించడం విశేషం.
పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలు అన్న గాంధీజీ సూక్తులను తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో మరోసారి చాటుకున్నది. గ్రామాల్లో ఒకవైపు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూనే, మరోవైపు పేద ప్రజల సంక్షేమానికి కూడా అదేస్థాయిలో ప్రాధాన్యమిస్తూ సమతుల్యంగా నిధులు కేటాయిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతున్నది. తెలంగాణ బడ్జెట్ పక్కా గ్రామీణ బడ్జెట్ అంటూ పలువురు ఆర్థికరంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తుండటం విశేషం.
ఏ రంగానికీ 3% మించని కేంద్రం బడ్జెట్
కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుపేదలను, పల్లెలను పూర్తిగా విస్మరించింది. కేంద్ర బడ్జెట్ మొత్తంగా రూ.45,03,097 కోట్లు కాగా, అందులో రోడ్లు మినహా మరే రంగానికి కూడా 3 శాతానికి మించి నిధులు కేటాయించలేదు. ట్రాన్స్పోర్టు రంగానికి గరిష్ఠంగా 11.48%, గ్రామీణాభివృద్ధికి 3.5%, పింఛన్లకు 5.20% నిధులను మాత్రమే కేటాయించింది. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, సంక్షేమ రంగానికి కలిపి మొత్తంగా కేంద్ర బడ్జెట్లో 14.85% వాటా కూడా దక్కలేదు. ఏ రంగానికీ, ఏ వర్గానికీ కనీస నిధులను కేటాయించపోవడం కేంద్ర ప్రభుత్వ పేదల వ్యతిరేక, సంక్షేమరాహిత్య విధానాలకు సంకేతం.