కరీంనగర్, ఫిబ్రవరి 3, నమస్తే తెలంగాణ ప్రతినిధి: సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ నేతన్నల సమస్యలను కూడా అదే మానవీయ కోణంలో చూశారు. సమైక్య రాష్ట్రంలో నేతన్నల బలవన్మరణాలు, అకలి చావులను చూసి చలించి పోయి ఆనాటి ప్రభుత్వాన్ని ఉద్యమకారుడిగా కేసీఆర్ నిలదీశారు. సిరిసిల్ల, పోచంపల్లి తదితర ప్రాంతాల్లోని నేతన్నల బాధలు, దుఃఖాన్ని స్వయంగా చూసిన ఆయన పలు కుటుంబాలను ఆనాడే వివిధ రకాలుగా ఆదుకున్నారు. స్వరాష్ట్రం సిద్ధిస్తే.. సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా కల్పించిన సీఎం ఆ దిశగానే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చేనేత రంగంపై జీఎస్టీ లాంటివి మోపి కేంద్రం నిలువెల్లా విషం కక్కుతుంటే.. అనేక రకాలుగా వారికి రాష్ట్రం ప్రభుత్వం అండగా నిలుస్తూ వస్తున్నది. ఈ తరుణంలోనే 2021 జూలై 4న రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ రైతుబంధు తరహాలోనే నేత కార్మికులకు ప్రభుత్వం తరపున బీమాతో ధీమా కల్పించనున్నట్టుగా ప్రకటించారు. ఆ మేరకు 2022 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించారు.
ఒక్కో కార్మికుడికి రూ.5,426 ప్రీమియం
నేతన్న బీమా పథకం 2022 ఆగస్టు 8 నుం చి అమల్లోకి వచ్చింది. 18-59 ఏళ్ల వయసు గల కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే బీమా కవరేజీకి సంబంధించిన ప్రీమియం చెల్లిస్తున్నది. ఏటా ఒక్కో కార్మికుడికి రూ.5,426 ప్రీమియం చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఏ కారణం చేత కార్మికుడు చనిపోయినా బినామీకి పది నుంచి 15 రోజుల్లోనే రూ.5 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుమా రు 40కి పైగా కుటుంబాలకు బీమా సొమ్ము అం దింది. రాష్ట్రంలో 35,999 మంది కార్మికులు ఈ బీమా కింద నమోదయ్యారు. ఒక్క సిరిసిల్లలోనే 4,704 మంది బీమా కింద అర్హత పొందారు.
సిరిసిల్లను పట్టించుకోని సమైక్య పాలకులు
సిరులతో ఉండాల్సిన సిరిసిల్ల నాడు సమైక్య రాష్ట్రంలో ఉరిసిల్లగా మారింది. అప్పట్లో వందలాది మంది చేనేత కార్మికులు బలవన్మరణం పొందారు. దానికి కారణం ఆనాటి సీమాంధ్ర సర్కారు చూపిన నిర్లక్ష్యమే. చనిపోయినప్పుడు సానుభూతి చూపడం, ఎన్నికలు రాగానే వరా లు కురిపించి ఓట్లు దండుకోవడం, ఆ తదుపరి ఇచ్చిన మాట మరిచి పట్టించుకోకపోవడం ఆనాటి సీమాంధ్ర సర్కారు పాలకులకే చెల్లింది. దీనికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. దేశంలోనే వస్త్ర పరిశ్రమలో రెండో సోలాపూర్గా ప్రసిద్ధి చెందిన సిరిసిల్ల పరిశ్రమపై సమైక్య ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వల్ల 1997 నుంచి 2007-08 వరకు 402 మంది చేనేత కార్మికులు బలవన్మరణం పొందినట్టు ఆనాటి అధికారిక లెక్కల్లోనే చూపారు. వాస్తవికంగా మరణాలు ఇంతకు మించే ఉన్నాయి. 2007-08లో సిరిసిల్లలో మరణమృదంగం మార్మోగింది.
నీటి మూటలైన నాటి వైఎస్ హామీలు
సిరిసిల్ల ఆత్మహత్యలు దేశవ్యాప్త చర్చకు దారి తీసిన నేపథ్యంలో 2009లో అసెంబ్లీకి ఎన్నికలు ముంచుకొచ్చాయి. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఆనాటి సీఎం వైఎస్ఆర్ హుటాహుటిన 2008 అక్టోబర్ 12న సిరిసిల్ల నడిబొడ్డున బహిరంగ సభ పెట్టి, కార్మికులకు అభయహస్తం ఇస్తున్నట్టు ప్రకటించారు. సిరిసిల్లను స్పెషల్ ఎకనామిక్ జోన్గా చేస్తామన్నారు. మరమగ్గాలపై తయారైన వస్ర్తాలను మార్కెటింగ్ చేయడానికి కావాల్సిన సౌకర్యాలను సిరిసిల్లలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ శాఖలు ఇక్కడి నుంచి వస్రాలు కొనే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అపారెల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సబ్సిడీ శాతాన్ని పెంచుతామన్నారు. వృద్ధ కార్మికుల కోసం వృద్ధాశ్రమం ఏర్పా టు చేస్తామన్నారు. కానీ ఏ ఒక్కటీ అమలు జేయలే.
బీమా సొమ్ముతో కొడుకుల్ని చదివిస్తున్న
మాది ఓదెల మండలం కనగర్తి. నా పేరు పరికిపండ్ల రవి. మా భార్య పేరు మహేశ్వరి. మాకు ఇద్దరు కొడుకులు. భార్యాభర్తలం మగ్గం పని చేసేటోళ్లం. గతేడాది ఆగస్టు 15న నా భార్య గుండెపోటుతో చనిపోయింది. 28 రోజులకే రూ.5 లక్షలు పడ్డయ్. వాటితోటి మాకున్న కొంత అప్పు కట్టిన. మిగతా పైసలతో నా కొడుకుల్ని చదివించుకుంటున్న. కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కాకుంటే మాకు రూ.5లక్షలు వచ్చేది కాదు.
-పరికిపండ్ల రవి, చేనేత కుటుంబం, కనగర్తి (ఓదెల)
సమైక్య రాష్ట్రంలో..
ఆనాటి వైఎస్సార్ ప్రభుత్వం నేత కార్మికుడు బలవన్మరణం చేసుకుంటేనే రూ.1.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని జీవో తెచ్చింది. దాన్ని పొందాలంటే 10 రకాల నిబంధనలు పెట్టింది. ముందుగా అధికారుల ధృవీకరణ, పోస్టుమార్టం, ఎఫ్ఐఆర్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు సమర్పించాలి. అయినా వేళ్ల మీద లెక్కపెట్టేంత మందికే ఇచ్చి మిగతా వారికి ఆనాటి సమైక్య ప్రభుత్వం మొండి చేయిచూపింది.
స్వరాష్ట్రంలో..
నేత కార్మికుడు ఎలాంటి మరణం పొందినా నేతన్న బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. కార్మికుడికి పైసా ఖర్చు లేకుండా జీఎస్టీతో కలిపి ఏడాదికి రూ.5,426 ప్రీమియంగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. సహజమరణం పొందినా రెండు వారాల్లోగా రూ.5 లక్షల బీమా సొమ్ము బ్యాంకులో నేరుగా జమవుతున్నది. బాధిత కుటుంబ సభ్యులు ఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు.
నా బిడ్డ పెళ్లికి డిపాజిట్ చేస్తా..
మా ఆయన కొడెం శ్రీశైలం పవర్లూం కార్ఖానాలో వార్పర్గా పనిజేసేటోడు. నేను బీడీలు జేస్త. మాకు ముగ్గురు పిల్లలు. చదువుకుంటుంన్రు. మా ఆయన పని జేత్తుండగనే గుండెపోటు వచ్చి జరిగిపోయిండు. నేను, మా పిల్లలం చావే గతనుకున్నం. సీఎం కేసీఆర్, కేటీఆర్ జేసిన బీమా వల్ల నాకు ఐదు లక్షలు వచ్చినయి. వాటిని బిడ్డ పెళ్లికోసం ఫిక్స్డ్ జేస్తున్న.
– కోడెం వనిత, సిరిసిల్ల
కేసీఆరే మా ఇంటి దీపమైండు..
నాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. నా పెద్దకొడుకు సూర్యనారాయణ ప్రమాదవశాత్తూ మానేరు వాగులో పడి చనిపోయిండు. చిన్నకొడుకు నవీన్, నేను బతుకుడే కష్టమైంది. అప్పులైనయ్. అగో గప్పుడు కేసీఆర్ మా ఇంటి దీపమైండ్రు. బీమా కింద రూ.5 లక్షలు నా ఖాతాలో ఏసిండ్రు. ఇప్పుడు ఉన్న బాకీ గట్టి మిగిలిన దాంతో మళ్లీ కష్టాలు రాకుండా జూసుకుంటం. ఏం జేసినా కేసీఆర్, కేటీఆర్ రుణం తీర్చలేం.
–నల్ల మల్లిఖార్జున్, సిరిసిల్ల
ఇల్లు రిపేర్ చేయించిన..
మాది ఓదెల మండలం కనగర్తి. మా ఆయన దాసరి వీరస్వామి సాంచాల మీద మగ్గం పనులు చేసేవాడు. పోయినేడు సెప్టెంబర్లో మా ఆయన చనిపోయిండు. నాకు ఒక కొడుకు శివకుమార్ ఉన్నాడు. పెద్దదిక్కు పోవడంతో మా బతుకులు ఆగమైతయ్ అనుకున్న. దేవుడోలే కేసీఆర్ సార్ మాకు సాయం చేసిండు. నెల రోజులల్లోనే రూ.5 లక్షలు బీమా సొమ్ము వచ్చింది. వీటితోటి మా పాత ఇల్లు రిపేరు చేయించుకుంటున్న.
– దాసరి పద్మ, చేనేత కుటుంబం, కనగర్తి (ఓదెల)
కొడుకు చదువు ఆగిపోతదని బాధపడ్డ
మా ఆయన సాంచాలు నడుపుతుండె. నేను కూలి పనులకు పోతా. మాకు ఒక్కడే కొడుకు, ఇంటర్ చదువుతుండు. ఇంతలోనే మా ఆయన అనారోగ్యంతో చనిపోయిండు. ఇల్లుకు జేసిన అప్పులు ఎట్ల తీర్సుడో అని నేను, నా కొడుకు బాధపడ్డాం. చదువు బంద్ చేయించి నా కొడుకును ఓ దుకాణంలో జీతానికి పెట్టిన. నేతన్న బీమా కింద రూ.5 లక్షలు వచ్చినయి. ఇల్లుకు జేసిన అప్పులు కట్టుకున్నం. కొడుకును చదువుకొమ్మని జెప్పిన.
– దండె పద్మ, మృతుడి భార్య (చొప్పదండి)