Minister Dayakar Rao | బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాత్రమే భవిష్యత్ భారతావనికి దిక్సూచి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 500 మంది మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి ఎర్రబెల్లి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో బీఆర్ఎస్ మాత్రమే కార్యకర్తల కోసం వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నదని తెలిపారు. బీఆర్ఎస్లాంటి పార్టీ దేశంలోనే లేదన్నారు.
కార్యకర్తల కోసం బీమా ప్రీమియం కట్టి.. ఏ కారణం చేత చనిపోయిన ఆ కార్యకర్తల కుటుంబానికి రూ.2లక్షల బీమా అందజేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. దాదాపు కోటి మంది సభ్యులున్న పార్టీ మరొకటి లేదని చెప్పారు. అనుభవజ్ఞుడైన సీఎం కేసీఆర్ నేతృత్వం, సమర్థవంతమైన కేటీఆర్ యువ నాయకత్వం బీఆర్ఎస్ సొంతమన్నార. పార్టీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ రంగాల్లో అత్యంత ముందుందని ఆయన చెప్పారు. పార్టీలో చేరిన నేతలకు సముచిత గౌరవం, గుర్తింపు దక్కుతుందన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని.. పార్టీలో తన గెలుపునకు కృషి చేయాలని మంత్రి కోరారు.