చౌటుప్పల్, ఫిబ్రవరి 4 : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన ద్రోహానికి చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 17వ వార్డు నుంచి పోటీలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థి పస్తం మల్లమ్మ బలైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థి చింతల ఉమామహేశ్వరికి కాంగ్రెస్ బీ ఫారం ఇచ్చి.. సొంత పార్టీ అభ్యర్థితో నామినేషన్ను ఉపసంహరింపజేయడంతో ఆ వార్డు ఏకగ్రీవమైంది.
డబ్బులు తీసుకొని ఎన్నికలు లేకుండా చేశావంటూ వార్డు ప్రజలు మల్లమ్మపై తిరుగుబాటు చేశారు. ఆమెను దూషిస్తూ.. నానా రభస సృష్టించారు. మనస్తాపానికి గురైన మల్లమ్మ, ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించగా.. అక్కడే ఉన్న కొందరు గమనించి కాపాడారు. ఉమామహేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ 17వ వార్డు ప్రజలు బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఓటు హక్కు లేకపోతే తామంతా చనిపోయినట్టేనా? అయితే తమకు మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.