హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వం, యువ నాయకుడు, చేనేత – జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో తెలంగాణలోని అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం దక్కింది.
అంగన్వాడీ టీచర్లు, ఆయాలను సముచితంగా గౌరవించేందుకు ఇప్పటికే ఎక్కడా లేని విధంగా మూడు సార్లు వేతనం పెంచి, 30 శాతం పి.ఆర్.సి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు నేతన్నలను ప్రోత్సహించడంలో భాగంగా అంగన్వాడీలకు చేనేత వస్త్రాలు అందించింది.
గురువారం హైదరాబాద్లోని కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ , మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవ రాజన్ కలిసి ఈ చేనేత చీరలను అంగన్వాడీలకు అందించారు.అనంతరం ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన చేనేత – జుట్ బ్యాగులను విడుదల చేశారు.
రాష్ట్రంలోని 31,711మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలలోని 67,411 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లకు ఈ చేనేత చీరలు అందనున్నాయని మంత్రులు తెలిపారు.
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి ఇప్పటికే రెండు జతల ప్రత్యేక చీరలు అందించామని వారు తెలిపారు. ఇప్పుడు తాజాగా మూడో జతగా చేనేత చీరలు అందించడం సంతోషంగా ఉందన్నారు.
అంగన్వాడీలకు గౌరవ ప్రదమైన వస్త్రాలు..సరైన వేతనాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేస్తున్నామని, ప్రి ప్రైమరీ విద్యను, పోషకాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు.
అనంతరం అంగన్వాడీలకు అభినందనలు, ట్రాన్స్ జెండర్లకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో ప్రభుత్వం తమ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేస్తామని హామీ ఇస్తున్నట్లు ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ తెలిపారు.