KTR | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో రోజుకు 6 గంటల విద్యుత్తే ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు ఎద్దేవా చేశారు. తమ అసమర్థత, చేతకానితనాన్ని కాంగ్రెస్ పార్టీనే స్వయంగా ఒప్పుకున్నదని అన్నారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్తుపై లఘుచర్చలో భాగంగా కేటీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 2010 ఫిబ్రవరిలో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నా నేదునూరులో పవర్ ప్లాంట్కు ఫౌండేషన్ వేశామని, రూ.13 కోట్లు వెచ్చించి 432 ఎకరాలు సేకరించామని చెప్పారు. గ్యాస్ అలకేషన్ కాకపోవడంతో ప్రాజెక్టులో జాప్యం జరిగిందని, ఆ ప్రాజెక్టు ఎందుకు పూర్తిచేయలేదని బీఆర్ఎస్ నేతలు తనకు పిండ ప్రదానం చేశారని తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ ప్రాజెక్టును ఎందుకు కట్టలేదని, వాళ్లకు ఏ ప్రదానం చేయాలని అన్నారు. దీనిపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇప్పుడున్న సీఎం స్వయంగా తమ నాయకుడు కేసీఆర్కు పిండం పెడతానని మాట్లాడారని గుర్తుచేశారు. ‘మానకొండూరు నియోజకవర్గంలోని నేదునూరు, చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ఆధారిత విద్యుత్తు కేంద్రాలు నెలకొల్పుతామని భూసేకరణ చేశారు. టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలేదు. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలేదు. కేంద్రం నిర్ణయం తీసుకున్న గ్యాస్ ఆధారిత కేంద్రాలు ఎందుకు పెట్టడం లేదని నిరసన వ్యక్తం చేశాం. బొగ్గులేని విజయవాడలో థర్మల్ పవర్ కేంద్రం ఎందుకు పెడుతారు? బొగ్గు, నీళ్లు లేని రాయలసీమలో ఎందుకు పెడుతారు? అని నాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ బిడ్డలుగా గట్టిగా కొట్లాడినం. నిరసనలు వ్యక్తం చేశాం’ అని కేటీఆర్ గుర్తుచేశారు.
ఈ దేశంలో గ్యాస్ ఆధారిత విద్యుత్తు కేంద్రం సఫలమైందా? నేదునూరులో గ్యాస్ అలకేషన్ అయిందా? అని ప్రశ్నించారు. ఆనాడు యూపీఏలో జైపాల్రెడ్డి పెట్రోలియంశాఖ మంత్రిగా ఉండి, గ్యాస్ అలకేషన్ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు టేకాఫ్ చేయాలని, నేదునూరు, శంకర్పల్లిలో ఆ ప్రాజెక్టులు పెడుతామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క అక్బరుద్దీన్ ఒవైసీ, మరోపక్క తాము మాట్లాడుతుంటే రేవంత్రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేతపత్రం ప్రవేశపెట్టింది ప్రభుత్వమేనని, అలాంటప్పుడు మంత్రి సమగ్ర సమాచారంతో రావాలని హితవు చెప్పారు.