PM Modi | హైదరాబాద్, నవంబర్11 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటన కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్టుగా ఉన్నది. మాదిగలు, మాదిగ ఉపకులాలను ప్రధాని మరోసారి మోసం చేశారు. సికింద్రా బాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించిన మాదిగ విశ్వరూప సభలో తియ్యటి మాటలతో మాదిగలను వంచించే ప్రయత్నం చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే కమిటీ వేస్తామని మాటల గారడీతో బురిడీ కొట్టించారు. ప్రధాని తీరుపై మాదిగ సంఘాల నేతలు, మేధావులు దుమ్మెత్తిపోస్తున్నారు. మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభను హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం మంద కృష్ణ నేతృత్వంలో నిర్వహించగా, ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సభ నిర్వహణకు ముందునుంచీ ఎస్సీ వర్గీకరణపై కీలకమైన ప్రకటన చేస్తారని బీజేపీ నేతలు ఊదరగొట్టగా, మోదీ మాత్రం యథావిధిగా మళ్లీ మాటలతో వంచించి పోయారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏండ్లుగా మాదిగలు పోరాడుతున్నారని, ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారంటూ మొసలి కన్నీరు కార్చారు.
వాస్తవానికి 2014 సాధారణ ఎన్నికల సందర్భంగానే తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతామని మోదీనే స్వయంగా హామీ ఇచ్చారు. బీజేపీ మ్యానిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారు. కానీ అధికారం చేపట్టి 3,455 రోజులు గడిచినా ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పోరాటంపై కపటప్రేమ ఒలకపోయడంపై మాదిగ మేధావివర్గం మండుతున్నది. మాదిగల పోరాటంపై అంత చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేండ్లుగా వర్గీకరణ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? పరిష్కారం చూపే ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
కమిటీ పేరిట మళ్లీ కాలయాపనే..!
విశ్వరూప సభలో ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాలనే చిత్తశుద్ధి బీజేపీ ప్రభుత్వానికి ఎంతమాత్రం లే దని స్పష్టంగా తేలిపోయింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని హామీ ఇవ్వకుండా వర్గీకరణ అంశంపై త్వ రలోనే కమిటీ వేస్తామని ప్రకటించడంలోనే మాదిగలను వంచిచాలనే బీజేపీ కుట్ర దాగి ఉ న్నదని నిపుణులు అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని మాదిగ మేధావివర్గం కూడా వ్యక్తపరుస్తున్నది. జనాభాపరంగా మాలలకన్నా మాదిగల సంఖ్య ఎకువైయినప్పటికీ, విద్య, ఉద్యోగావకాశాల్లో మాదిగలు చాలా తకువ స్థాయి లో ఉండటమే వర్గీకరణ ఉద్యమానికి మూలం. మాదిగల పోరాటంతో ఈ అంశంపై 1995లో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను నియమించింది. మాదిగల వాదన నిజమేనని ఆ కమిషన్ నివేదికను సమర్పించగా, దాని ఆధారంగా 1997లో ఆనాటి తెలుగుదేశం (ఎన్డీఏ భాగస్వామ్యం) ప్రభుత్వం 15 శాతం ఎస్సీ కోటాను ఏ, బీ, సీ, డీగా విభజించింది. 2000 సంవత్సరంలో రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టం చేసింది. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అది అమల్లో కి వచ్చింది. అయితే ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని 2004 నవంబర్లో సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది.
దీంతో వర్గీకరణ పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. మళ్లీ ఒత్తిళ్లు పెరగడంతో 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయగా, దానికి ప్రతిస్పందనగా కేంద్ర సామాజిక న్యా యం, సాధికారత మంత్రిత్వ శాఖ ఉషా మెహ్రా కమిషన్ను ఏర్పాటు చేసింది. 2008 మేలో అప్పటి మంత్రి మీరాకుమార్కు కమిషన్ తన నివేదికను సమర్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ని సవరించాలని, ఆ ఆర్టికల్లో 3వ క్లాజును చేర్చడం ద్వారా, రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంటు ఆమోదించవచ్చని కమిషన్ సిఫారసు చేసింది. కానీ కేంద్రంలోని కాం గ్రెస్ దానిని పట్టించుకోలేదు. 2014 ఎన్నికలప్పుడు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన మోదీ, బీజేపీ నేతలు ఇప్పటికీ దానిని పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వర్గీకరణ అంశంపై తీర్మానం చేసి కేంద్రానికి పంపినా ఇప్పటికీ అది స్పందించలేదు. విశ్వరూప సభలో ఆ దిశగా సానుకూల నిర్ణయం వస్తుందని మాదిగలు ఆశించినా అడియాసే అయ్యింది. ఓట్ల కోసం తప్ప మోదీ ప్రకటనలో మరేమీలేదని విశ్లేషకులు అంటున్నారు.
ఎస్సీలకు ప్రత్యేకంగా ఏం చేశారు..?
సభలో వర్గీకరణ అంశమేగాకుండా ఎస్సీ సంక్షేమంపైనా ప్రధాని అడ్డగోలుగా మాట్లాడారని మాదిగ మేధావులు నిప్పులు చెరుగుతున్నారు. ఉచిత రేషన్ బియ్యం, గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని, టాయిలెట్లు కట్టిస్తున్నామని, ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నామని ప్రకటించడంపై మండిపడుతున్నారు. అవి మాదిగలకు మాత్రమే ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. దేశంలోని పేదలందరికీ ఇస్తున్నా రు తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదని ధ్వజమెత్తుతున్నారు. బీజేపీ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో మాదిగలకు చేసిన ఒక్క మంచి పనీ లేదని వి మర్శిస్తున్నారు. విశ్వకర్మ యోజన కింద కులవృత్తిదారులకు రుణం రూపంలోనే ఆర్థిక సా యం అందిస్తున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దళితులకు 100 శాతం సబ్సిడీతో రూ.10 లక్షలను అందిస్తున్న దళితబంధును విమర్శించడం సిగ్గుచేటని దళిత మేధావి వర్గం దుయ్యబడుతున్నది. ప్రధాని వస్తున్నారంటే ఏ దో ఊహించుకున్నామని, కానీ మోదీ చెప్పిం ది, చేసింది ఏమీ లేదని విమర్శించారు.
తెలంగాణలో అంబేద్కర్కు అందలం
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నది. అందుకు దళితబంధు పథకమే నిదర్శనం. హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో నిర్మించింది. కొత్తగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి కూడా ఆయన పేరే పెట్టి గొప్పగా గౌరవించింది. అంబేద్కర్కు భారతరత్న ఇప్పించామని, ఆయన ఫొటోను పార్లమెంటులో పెట్టామని గొప్పగా చెప్పుకొన్న ప్రధాని.. కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్లను మాత్రం కనీసం పట్టించుకోలేదు. నిజానికి 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడే అంబేద్కర్కు భారతరత్న ఇచ్చారు. అదే సందర్భంలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో మోదీ చెప్పుకొనేంత గొప్పలు ఏమున్నాయని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.