Food products | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : వనరులకు కొరతలేని మన దేశంలో తినే తిండికి కొరత ఏర్పడుతున్నది. దేశ ప్రజలకు ఆహార పదార్థాలను అందించేందుకు ఇతర దేశాల వైపు చూడాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర సరుకులైన వంట నూనెలు, పండ్లు, పప్పు దినుసులను దిగుమతి చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదేండ్లలో రూ.8.5 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. దేశ అవసరాలకు కావాల్సిన దాదాపు సగం ఉత్పత్తులు చిన్నచిన్న దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇక ఈ దిగుమతి చేసుకుంటున్న సరుకుల విలువ ప్రతి ఏడాది పెరుగుతున్నది. 2020-21తో పోల్చితే 2021-22లో దిగుమతుల విలువ 50.56 శాతం పెరగడం గమనార్హం. దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల్లో నూనెలు 72.34 శాతం ఉండగా, పండ్లు 16.35శాతం, పప్పులు 39.29 శాతం, సుగంధ ద్రవ్యాలు 20 శాతం, కాజుపప్పు 24.66 శాతం ఉన్నాయి. ఈ వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది.
2 లక్షల కోట్ల దిగుమతులు
గత ఐదేండ్లలో ఆహార ఉత్పత్తుల దిగుమతి విలువ 65.69 శాతం పెరిగింది. 2017-18లో దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తుల విలువ రూ.1.57 లక్షల కోట్లు కాగా, 2021-22 నాటికి ఇది రూ.2.39 లక్షల కోట్లకు పెరిగింది. అంటే గడిచిన ఐదేండ్లలో ఆహార ఉత్పత్తుల దిగుమతి కోసం రూ. 82వేల కోట్లు అధికంగా వెచ్చించాల్సి వచ్చింది. దిగుమతి చేసుకుంటున్న సరుకులలో అత్యధికంగా నూనెలకు రూ.1.41 లక్షల కోట్లు చెల్లిస్తున్నారు. 2017-18లో నూనెల దిగుమతి విలువ రూ. 75 వేల కోట్లు ఉండేది. ఐదేండ్లలో ఇది రెట్టింపు కావడం గమనార్హం. అదే విధంగా పండ్ల దిగుమతికి రూ. 18,342 కోట్లు, పప్పులకు రూ. 16,628 కోట్లు, సుగంధ ద్రవ్యాలకు రూ. 9,685 కోట్లు, కాజుపప్పుకు రూ. 9,338 కోట్లు చెల్లించారు. మొత్తంగా 2017 నుంచి 2022 వరకు రూ. 8.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను దేశం దిగుమతి చేసుకున్నది.