SSC Exams | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): బ్లూ ప్రింట్కు విరుద్ధంగా ఇచ్చిన పదో తరగతి జీవశాస్త్రం ప్రశ్నలపై ఎస్సెస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరో ప్రశ్నకు జవాబు రాసిన వారికి రెండు మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రశ్నను అటెంప్ట్ చేసిన వారికి మాత్రమే మార్కులు కలుపుతారు. మార్చి 28న జీవశాస్త్రం పరీక్ష జరిగింది. సెక్షన్-2లో ఇచ్చిన 6వ ప్రధాన ప్రశ్నలో కొన్ని చిత్రాల కింద నాలుగు ప్రశ్నలు ఇచ్చారు.
మొదటి రెండు విద్యాప్రమాణాలను అనుగుణంగా లేకపోవడంతో సబ్జెక్టు టీచర్లు అభ్యంతరాలను లేవనెత్తారు. బ్లూప్రింట్కు విరుద్ధంగా తప్పుగా ఇచ్చారని ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఎస్సీఈఆర్టీ నుంచి నివేదిక కోరారు. అధ్యయనం చేసిన ఎస్సీఈఆర్టీ విషయ నిపుణుల బృందం ప్రశ్నల్లో తప్పులున్నట్లుగా గుర్తించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం అదనంగా మార్కులు ఇచ్చేందుకు అంగీకరించారు.
బుధవారం అన్ని జిల్లాల డీఈవోలతో ఎస్సెస్సీ బోర్డు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక్కో మార్కు చొప్పున రెండు ప్రశ్నలకు రెండు మార్కులేసే విషయంపై స్పష్టత ఇచ్చారు. ఐదో ప్రశ్నను ఇంగ్లిష్లో ఒకలా, తెలుగులో మరోలా ఇచ్చారు. ఈ రెండూ జీవశాస్త్రంలో అంతర్భాగంగా ఉన్నాయి. విద్యార్థులు దేనికి సమాధానం రాసినా మార్కులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభమైంది. మరో 15 రోజుల్లో ఈ మూల్యాంకనం ముగుస్తుంది. మే 2, 3 తేదీల్లో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.