హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): బీసీలు, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం పథకం అమలు శరవేగంగా ముందుకు సాగుతున్నది. గత నెల 15న రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని ప్రారంభించగా ఇప్పటికే మొదటి విడత పంపిణీ తుది దశకు చేరుకున్నది. తొలివిడతలో నియోజకవర్గానికి 300 మంది చొప్పున మొత్తంగా 35,700 మందికి రూ.లక్ష చొప్పున అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తొలివిడత జాబితాలోని లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ పూర్తికాగా, కొన్ని చోట్ల అదీ కొద్దిమందికి అందజేయాల్సి ఉన్నది. త్వరలోనే రెండవ విడత చెక్కులను అందజేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.