హైదరాబాద్ : అంధత్వ నివారణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగును అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ మయూరీనగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి వైద్య పరీక్షల కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేవలం తెలంగాణలో కంటివెలుగు కొనసాగుతున్నదన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఈ పథకం విజయవంతంగా కొనసాగుతున్నదని తెలిపారు. కంటి వెలుగుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని వెల్లడించారు. కేంద్రాలలో ఉచితంగా అందిస్తున్న కంటి వెలుగు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
అనంతరం ఆయన మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరీనగర్లో రూ. 20 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి పరిశీలించారు. నియోజకవర్గంలోని అన్ని కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో అధిక నిధులను సమకూర్చుకుంటూ డ్రైనేజీ,తాగునీరు, రహదారులు, విద్యుత్ సహా ఇతర వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు.