Jayam Ravi | కోలీవుడ్ స్టార్ నటుడు రవి మోహన్ (జయం రవి) మరోసారి తన సినీ ప్రయాణాన్ని కొత్త ఉత్సాహంతో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలిచిన ఆయన, ఇప్పుడు వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ కెరీర్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఓ సినీ కార్యక్రమంలో చేసిన భావోద్వేగ ప్రసంగంతో అభిమానులను ఆకట్టుకున్న రవి మోహన్, గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఫ్యాన్స్కు బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
కొద్ది నెలల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు కొంతకాలం దూరంగా ఉంటానని ప్రకటించిన రవి మోహన్, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. జీవితంలో ఒక క్లిష్టమైన దశ ముగిసిందని, ఇప్పుడు పూర్తిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నానని ఆయన తెలిపారు. ఇది నాకు రెండో జన్మ లాంటిది. గతాన్ని వదిలేసి, ఇకపై నటుడిగా మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే నా లక్ష్యం అంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఆశలను నింపాయి. గత కొద్ది నెలలుగా రవి మోహన్ వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. భార్య ఆర్తితో విభేదాలు, అనంతరం సింగర్ కెనీషాతో ఆయన పేరు వినిపించడం, వాటిపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్, వివాదాలు వరుసగా వార్తల్లో నిలిచాయి. ఈ వ్యవహారంపై ఒక దశలో మీడియా ముందుకు వచ్చిన రవి మోహన్, తనపై వస్తున్న ఆరోపణలతో పాటు కెనీషాపై జరుగుతున్న ట్రోలింగ్పై కూడా స్పందించారు.
ఆ తర్వాత ఆయన పూర్తిగా మీడియాకు దూరమయ్యారు. కొత్త సినిమాలకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో, రవి మోహన్ సినీ కెరీర్కు బ్రేక్ పడిందా? సినిమాలకు గుడ్బై చెప్పబోతున్నారా? అనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఆయన స్వయంగా అభిమానుల ముందుకు రావడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. తన ప్రసంగంలో అభిమానులను ఉద్దేశించి రవి మోహన్ భావోద్వేగంగా మాట్లాడారు. నా వల్ల మీలో ఎవరికైనా నిరాశ కలిగితే క్షమించండి. మీ ప్రేమ, మద్దతు వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ఇకపై నా పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంటుంది అని అన్నారు. గతంలో తాను చేసిన పాత్రలను గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో కూడా అలాంటి గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గతాన్ని తలచుకుని బాధపడటం కంటే, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగడం మంచిదని నేను నమ్ముతున్నాను. ఇక నుంచి నా పని మాత్రమే మాట్లాడుతుంది” అని రవి మోహన్ స్పష్టం చేశారు. కాగా, రవి మోహన్ కొత్త ఆరంభానికి ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న బ్రో కోడ్ వేదిక కానుంది.