హైదరాబాద్ / సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ): మాండస్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడుతాయని పేర్కొన్నది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తున్నాయని, ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతున్నదని చెప్పింది. ఆదివారం మెదక్లో 17 డిగ్రీలు, నల్లగొండ 17.2, ఆదిలాబాద్లో 17.7, హకీంపేట 18.9, హనుమకొండ 19, హైదరాబాద్ 19.2, దుండిగల్ 20, రామగుండం 20, నిజామాబాద్ 20.5, ఖమ్మం 20.6, మహబూబ్నగర్ 21.5, భద్రాచలంలో 24 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
శనివారం ఉదయం ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి, సాయంత్రం వాయుగుండంగా, ఆదివారం ఉదయం ఐదున్నర గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం కూడా బలహీనపడిందని చెప్పింది. మాండస్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్లో ముసురు వాన కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి చిరుజల్లులు కురుస్తున్నా యి. 13న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి.
గ్రేటర్లో తేలిక పాటి వర్షాలు..
గ్రేటర్లో ఆదివారం తేలికపాటి వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠం 26.0 డిగ్రీలు, కనిష్ఠంగా 19.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ 78 శాతం గా నమోదయ్యింది. రాగల 24 గంటల్లో ఆకా శం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉదయం వేళల్లో పొగమం చు కప్పుకుంటుందని, తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి చల్లని గాలులు వీస్తాయని చెప్పారు.
రాయలసీమలో జోరువానలు
ఏపీపై మాండస్ తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. దీని ప్రభావంతో రాయలసీమ అం తటా జోరువానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. నెల్లూరులో పలు కాలనీలు నీ ట మునిగాయి. ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాలోని నదులు, వాగులు పొంగి పొర్లుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటపొలాల్లోకి వరద నీరు చేరింది. సోమశిల జలాశయం నుంచి దిగువకు భారీగా నీరు వదలడంతో పరీవాహక గ్రామాలు వరద ముప్పులో చికుకున్నాయి. మాండవ్య బహుదా, పింఛా నదుల ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు.