హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి శుక్రవారం ఉదయం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది బంగ్లాదేశ్లోని ఖేర్పురకు దక్షిణ నైరుతీదిశగా 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈశాన్యం వైపునకు కదులు తూ శనివారం నాటికి తుఫాన్గా బలపడనున్నదని వాతావరణశాఖ పేరొన్నది. ఆదివారం బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశమున్నదని తెలిపింది. దీనికి రెమల్ తుఫాన్గా పేరుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్ రాష్ర్టాలకు హెచ్చరికలు జారీచేసింది. తీరందాటే సమయంలో భారీ వర్షాలతోపాటు గంటకు 102 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలి న ప్రాంతం, ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం నైరుతీ రుతుపవనాలు విస్తరించాయి.
మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమయిందని దీని ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు. వాయుగుండం ఈశాన్యం దిశగా కదులుతూ బలపడుతున్నదని.. శనివారం తుఫానుగా మారబోతున్నదని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి కల్లా బంగ్లాదేశ్ – పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటుతుందని పేర్కొన్నారు. అకడకడా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపా టి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడొచ్చని వెల్లడించింది. గురువారం అత్యధికంగా హనుమకొండ జిల్లా వేలేర్ మండలంలో 6.2సెం.మీ, జనగామ జిల్లా మలాపూర్లో 5.2, యాదాద్రిలో 3.8, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలతోపాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం పడింది.