Elon Musk : అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) హ్యాకింగ్కు గురవ్వడంపై టెస్లా, స్పేస్ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్ను నివారించవచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదా ఏఐ (AI) సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది’ అని మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్యూర్టోరికోలో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కారణంగా అక్కడి అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి సారించారు. యూఎస్ (US) మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ ఈ హ్యాకింగ్పై మాట్లాడుతూ.. ‘ప్యూర్టోరికోలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటు చేసుకొన్నాయి. పేపర్ ట్రయల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించగలిగాము. లేదంటే ఏం జరిగేదో.. ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాలి. అలా చేస్తే ప్రతి ఓటు లెక్కించే అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు.