హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులు కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. సాధారణ ఈనెలలో కురువా ల్సిన వర్షాలు ఆశించినస్థాయిలో లేకపోవడంతో కూరగాయల సాగుకు తీవ్ర ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. దీంతో కూరగాయల దిగుబడి తగ్గి, ధరలు భారీగా పెరిగిపోయాయి. మొన్నటి వరకు హోల్సేల్ మారెట్లో రూ.30 నుంచి రూ.40ల మధ్య ఉన్న టమాటా, ప్రస్తుతం ఇతర రాష్ర్టాల నుంచి వస్తుండటంతో కిలో రూ. 50 నుంచి రూ.60 వరకు ధర పలుకుతున్నది. బీన్స్ రైతు బజారులో కిలో రూ.100 ఉండగా, రిటైల్ మారెట్లో రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. చికుడుకాయ రూ.70 నుంచి రూ. 80 ఉండగా, బయట మారెట్లో రూ.110 అధికంగా పలుకుతున్నది. క్యాప్సికం కేజీ రూ.40 నుంచి రూ.60 ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో రూ.120 నుంచి రూ.160గా పలుకుతున్నది. క్యారెట్ కూడా రూ.30 నుంచి రూ.80కి చేరింది.
రాష్ట్రంలో కూరగాయల దిగుబడి తగ్గిపోవడంతో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో రైతులు సాగుచేసిన కొద్దిపాటి పంటలకు బోర్ నీటినే వర్షం మాదిరిగా స్ప్రే చేస్తూ పంటలను బతికించే ప్రయత్నం చేస్తున్నామని రైతులు చెప్తుతున్నారు. వేసిన పంటలు కూడా మొలకెత్తే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో సుమారు 5లక్షల ఎకరాల్లో పండిన కూరగాయలు, 2025లో 75,000 ఎకరాలకు పడిపోయింది.
ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులతో వర్షాలు ఆశించినస్థాయిలో లేవని ఉద్యాన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. సాధారణ వర్షాలకు పండే కూరగాయలను సాగు చేసుకోవడమే ఉత్తమమని సూచించారు. ఎల్నినో వల్ల కొద్దిపాటి దిగుబడులు తగ్గినా చిన్న, సన్న రైతులకు పెద్దగా నష్టం ఉండదని పేర్కొన్నారు. స్వల్పకాలిక పంటలైన ఆకుకూరలు, నీటి ఎద్దడిని ఎదుర్కొనే కూరగాయల సాగు ఎంతో శ్రేయస్కరమని సూచించారు.
ఇంతకుముందు హోల్సేల్ మార్కెట్కు చుట్టుపక్క జిల్లాల నుంచి పెద్దఎత్తున కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో మార్కెట్కు కూరగాయల సరఫరా చాలా తగ్గింది. దీంతో పొరుగు రాష్ర్టాల నుంచి కూరగాయలు వస్తుండటంతో రేట్లు రెండింతలు పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయి. అన్ని రకాల కూరగాయలను తెచ్చి అమ్మే పరిస్థితి లేదు.
– కూరగాయల వ్యాపారి సుగణమ్మ
ఇటీవల ఎండలకు టమాటా, మిర్చి పంట బాగా దెబ్బతిన్నది. రెండెకరాల్లో వేసిన పంట మూడొంతులు దెబ్బతిన్నాయి. దీంతో వేసవిలో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. ఈ సీజన్లో టమాటా, మిర్చి, బెండ, సొరకాయ సాగు చేయడానికి పనులు మొదలు పెట్టా. ప్రస్తుతానికి పాలకూర, తోటకూర, పూదీన, కొత్తిమీర, మెంతి వంటి ఆకుకూరలు సాగు చేస్తున్నాను.
-యాచారం రైతు రాములు
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఈ ఏడాది కనీసం లక్ష ఎకరాల్లో కూరగాయల సాగు పెంచేందుకు రైతులను సన్నద్ధం చేస్తున్నాం. ఎల్నినో పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగు చేసే కూరగాయల పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే కూరగాయల సాగు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
-ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా