హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. తమ ప్రయత్నాలకు తోడుగా నిలిచేందుకు ‘గ్రీన్ కో’ సంస్థ ముందుకొచ్చి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని పలు కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. కరోనా కట్టడికి మరిన్ని సంస్థలు కలిసిరావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
చైనా నుంచి విమానంలో..
పునరుత్పాదక విద్యుత్తు రంగ దిగ్గజ సంస్థ గ్రీన్ కో చైనా నుంచి ప్రత్యేకంగా 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను తెప్పించి ఆదివారం తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. ఇవి ఒక్కోటి నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్ను ఉత్పత్తి చేయగలవు. చైనా నుంచి ప్రత్యేక విమానం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి రాగా, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, గ్రీన్ కో సంస్థ సహ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేశ్ కోహ్లీ వాటిని అందుకొన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తొలిసారి విమానంలో మన దేశానికి రావడం, అదీ హైదరాబాద్కు చేరడం విశేషం. ఈ సందర్భంగా గ్రీన్ కో సంస్థ యాజమాన్యానికి మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా కట్టడికి ఎలాంటి నిధుల కొరత లేదని కేటీఆర్ చెప్పారు. యంత్రాలను వేగంగా చేరవేసిన విమాన సంస్థ ఇండిగో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ కో సంస్థ మొత్తం వెయ్యి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను తీసుకురానుందని, తొలి విడుతగా వచ్చిన 200 కాన్సన్ట్రేటర్లను ముందుగా తెలంగాణకు ఇవ్వడం హర్షణీయమని చెప్పారు.
కేంద్రం స్పందించడం హర్షణీయం
తెలంగాణ పొరుగున ఉన్న నాలుగు రాష్ర్టాల నుంచి కొవిడ్ రోగులు హైదరాబాద్ నగరానికి వైద్యంకోసం వస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. వారికి అన్నిరకాలుగా చికిత్స అందిస్తున్న నేపథ్యంలో అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరగా సానుకూలంగా స్పందించిందంటూ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో రాజకీయాలకతీతంగా అందర్నీ కలుపుకొని పోతున్నామని పేర్కొన్నారు. ఆక్సిజన్, మందుల సరఫరా విషయంలో మిగిలిన రాష్ర్టాలకన్నా తెలంగాణ మెరుగైన పరిస్థితిలో ఉన్నదని వెల్లడించారు. ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా ఆక్సిజన్ అందక జరిగిన దురదృష్టకర సంఘటనలు తెలంగాణలో చోటుచేసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు స్థానిక వైద్య సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుంటూ ముందుకుపోతున్నదని చెప్పారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు..
కరోనాపై పోరులో తమవంతు సాయంగా వెయ్యి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించనున్నట్టు గ్రీన్ కో సంస్థ సహ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేశ్ కోహ్లీ తెలిపారు. మిగతా 800 కాన్సన్ట్రేటర్లు విడుతల వారీగా వచ్చేవారం వస్తాయని, వీటిని బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాలకు అందజేయనున్నట్టు వెల్లడించారు. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని కొవిడ్ చికిత్స అందించే దవాఖానల్లో, మొబైల్ యూనిట్లలో వినియోగించేలా ప్రణాళిక రూపొందించామన్నారు.