మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్, పెద్ద చెరువులో నిర్మిస్తున్న ఐలాండ్కు విద్యుత్ సరఫరా కోసం వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మినీ ట్యాంక్ బండ్ వద్ద కేబుల్ లైన్లు, విద్యుత్ లైట్ల ఏర్పాటుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని సూచించారు. సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనులకు, మినీ శిల్పారామానికి అవసరమైన విద్యుత్ సరఫరా కోసం నూతన ట్రాన్స్ఫార్మర్స్, లైన్లను సత్వరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో 13 ట్రాన్స్ఫార్మర్స్, మహబూబ్నగర్ గ్రామీణ మండలం లోని 19 ట్రాన్స్ఫార్మర్స్, పలు గ్రామాల్లో వ్యవసాయ అవసరాలకు మెరుగైన విద్యుత్ సరఫరాకు వెంటనే నూతన ట్రాన్స్ఫార్మర్స్ బిగించాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
ట్యాంక్ బండ్ వద్ద 50 KV ట్రాన్స్ఫార్మర్స్ ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన ట్రాన్స్ఫార్మర్స్ను రెండు, మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్ పీడీసీఎల్ ఎస్ఈ మూర్తి, డీఈ నవీన్ కుమార్, కౌన్సిలర్ జాజిమొగ్గ నర్శింహులు, తదితరులు పాల్గొన్నారు.