హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖలోని పలు అంశాలపై హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. పంచాయతీరాజ్ శాఖలో ఇప్పటికే పదోన్నతులు పొందిన 57 మంది డీపీఓలు, ఎంపీడీఓలకు పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించాలని, దీనికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలన్నారు.
కారోబార్లు, పంప్ మెకానిక్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇంకా పూర్తికాని వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులను సాధ్యమైనంత తొందరగా పూర్తయ్యే విధంగా చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు తదితరులు పాల్గొన్నారు.