హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్ బలపడే అవకాశం ఉందని, ఈ తుఫాన్కు మయన్మార్ ‘మిచౌంగ్’ అని పేరు పెట్టిందని పేర్కొన్నది. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు ఏపీ, తెలంగాణల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడతాయని చెప్పింది. హైదరాబాద్ అంతటా పొడి వాతావరణం ఉంటుందని, చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
చెన్నైలో కుండపోత
తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తాయి. అల్ప పీడనం కారణంగా చెన్నై సహా ఉత్తర కోస్తా ప్రాంతాల్లో బుధవారం కుంభవృష్టి కురిసింది. తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రహదారులు నదులను తలపించడంతో చెన్నై ఐటీ కారిడార్ షోలింగనల్లూరు సహా పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రైలుపట్టాలపై నీరు నిలిచిపోయింది. అంబత్తూరు-అవడి-అరక్కోణం సెక్షన్లలో సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి.