హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలతో పాటు 28 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ ఝార్ఖండ్, గాంగ్టక్, పశ్చిమ బెంగాల్ పరసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది.
ప్రస్తుతం ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో ఈ నెల 8 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది.