హైదరాబాద్: రాష్ట్రంలో నేడు రేపు వడగాడ్పులు (Heat Waves) వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు సైతం రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదు కావచ్చని పేర్కొన్నది. ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని, ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్లో కూడా తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. 7వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఆదివారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంటూ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. శుక్రవారం నల్లగొండ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్లో 43.4, మాడుగులపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్డీపీఎస్ వివరించింది.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగడంతో వేడి తీవ్రతకు తట్టుకోలేక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. హైదరాబాద్లోని పలు దవాఖానల్లో అక్యూట్ డయేరియా డిసీజ్ (ఏడీడీ), వాంతులు, డీ హైడ్రేషన్ కేసులు పెరుగుతున్నాయి. వేసవిలో వడగాడ్పులు వీస్తున్నందున పిల్లలు జ్వరం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కండ్లు మండటం, తలనొప్పి, తల తిరగడం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు వచ్చినప్పుడు పిల్లలను చల్లని ప్రదేశాల్లో ఉంచాలని వైద్యులు సూచించారు. కొబ్బరి నీరు లేదా ఓఆర్ఎస్ వంటివి ఇవ్వాలని తెలిపారు. వేసవి కాలంలో నీళ్లు ఎక్కువగా తాగుతూ నీడ పట్టున ఉంటే మంచిదని పేర్కొన్నారు.