సోన్, డిసెంబర్ 27 : నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం అనంతపేట్ కేజీబీవీలోని పది మంది విద్యార్థినులు ఉడికీ ఉడకని అన్నంతిని శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం వండిన భోజనం సరిగా ఉడకకపోవడంతో పాఠశాలలో దాదాపు పది మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అందులో ఐదుగురి పరిస్థితి మెరుగుపడడంతో పాఠశాలకు పంపించారు.
మరో ఐదుగురిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. మిగతా విద్యార్థుల పరిస్థితి అదుపులోనే ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయం పట్ల ఎంఈవోఓను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధుల్లో చేరినట్టు చెప్పారు. అన్నం వండడంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని, దానిని తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నట్టు పేర్కొన్నారు.