Bhadrachalam | ఖమ్మం, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక దందా పెను దుమారమే రేపుతున్నది. ఇసుక రవాణా వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉన్నందునే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇసుక దందా వ్యవహారంలో బూర్గంపహాడ్ పోలీసులు మొత్తం 17 లారీలను పట్టుకోగా, ఇప్పుడు పోలీస్స్టేషన్లో ఆరు లారీలే నిలిపి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. మొత్తం 12 లారీలకు సంబంధించి 12 కేసులు నమోదు చేశామని, కొందరు జరిమానా చెల్లించి తమ వాహనాలను తీసుకెళ్లారని ఆర్టీఏ అధికారులు చెప్తుండగా, మైనింగ్శాఖ అధికారులు మాత్రం ధ్రువీకరించడం లేదు.
జరిమానా విధింపు, వాహనాల విడుదలపై తమకు ఎలాంటి సమాచారం లేదని సమాధానమిస్తున్నారు. మరోవైపు మిస్ అయిన లారీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో కూడా బూర్గంపహాడ్ పోలీసులు పెదవి విప్పకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఇసుక దందా వెనుక పెద్దల హస్తం లేకపోతే అధికారులు ఎందుకు మీడియాకు వివరాలు వెల్లడించడం లేదో అంతుచిక్కడం లేదు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి పాల్వంచ డీఎస్పీ వెంకటేశ్ను వివరణ కోరగా తమ ఆధీనంలో మొత్తం 16 లారీలు ఉన్నాయని సమాధానమిచ్చారు.
ఏపీలోని గుండాల ఇసుక రీచ్ నుంచి తెలంగాణకు భారీగా ఇసుక తరలుతున్నదనే అంశంపై మూడు రోజులుగా ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమవుతున్న కథనాలకు అక్కడి అధికారులు స్పందించారు. ఆంధ్రా నుంచి తెలంగాణలోకి రావాలంటే టన్నుకు రూ.200 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ రీచ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక వస్తున్నది కాబట్టి అక్రమార్కులు ప్రభుత్వానికి రుసుమేమీ చెల్లించరు. గతంలో ఈ దందా చర్ల, వెంకటాపురం మార్గంలో సాగేది. ప్రస్తుతం మేడారం జాతర కారణంగా ఆ రూట్లు బిజీగా ఉండటంతో అక్రమార్కులు భద్రాచలం మీదుగా దందా సాగిస్తున్నట్టు తెలుస్తున్నది.
పాల్వంచ మండలంలోని నాగారం చెక్పోస్టు కేంద్రంగా మామూళ్ల పర్వం కొనసాగుతున్నదని, అక్రమార్కులు ఇచ్చే సొమ్ముకు లొంగి ఇసుక లారీలను విడిచిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడి అధికారులు, సిబ్బంది ప్రతి అక్రమానికి ఒక రేటు ఫిక్స్ చేసినట్టు తెలుస్తున్నది. ఓవర్లోడ్కు ఒక రేటు.. ధ్రువపత్రాలు లేకపోతే మరో రేటు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఆ చెక్పోస్టు వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఓవర్లోడ్తో వెళ్తున్న ఏడు లారీలను పట్టుకున్నారు. వాస్తవానికి ఆ బాధ్యత ఆర్టీఏ అధికారులది. కానీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లారీలను ఎందుకు పట్టుకున్నారో అంతుబట్టని ప్రశ్న.