Telangana Minister Errabelli | `నా కోసం నెల కష్ట పడండి… వచ్చే ఐదేండ్లు సేవ చేస్తా!.. ప్రజా సంక్షేమమే నా ప్రథమ కర్తవ్యం` అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం దేవరుప్పుల మండలం 10 గ్రామాలకు కోలుకొండ, 12 గ్రామాలకు సింగరాజు పల్లిలలో గ్రామాల వారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు బాగోగులు తెలుసుకున్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. గత ఐదేండ్లలో మంత్రిగా నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దానని పేర్కొన్నారు. ఇంకొన్ని పనులు చేయాల్సి ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక మన ప్రభుత్వం వచ్చాక ఆ పనులను పూర్తి చేసి, నాకు ఓటేసిన ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. `సీఎం కేసీఆర్ మనకు శ్రీరామరక్ష` అని పేర్కొన్నారు. తిరిగి సీఎం కేసీఆర్ను మరోసారి అధికారంలోకి తేవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలిపారు.