ఐఐటీ హైదరాబాద్తో జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఎంవోయూ
దేశంలోనే తొలిసారి ట్రీ హబ్ ఏర్పాటు!
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 7: ఆధునిక సాంకేతిక రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ఐఐటీ హైదరాబాద్ కృషి చేయనున్నది. దీనికోసం జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో ఐఐటీ హైదరాబాద్ గురువారం ఎంవోయూ కుదుర్చుకొన్నది. స్మార్ట్ ఇండియన్ హైవేస్లో భాగంగా దీర్ఘకాలిక, సుస్థిరమైన హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం 10 వినూత్న ప్రాజెక్టులను రూపొందించనున్నారు. ట్రాన్స్పోర్టు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ (ట్రీ హబ్), సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతికతతో రహదారుల అభివృద్ధికి కృషి చేయనున్నారు.
ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ ఆర్అండ్డీ డీన్ ప్రొఫెసర్ కిరణ్కూచి మాట్లాడుతూ.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా రవాణాలో ఆధునిక పరిశోధనలకు దోహదం కానున్నదన్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జీఎం (న్యూఢిల్లీ) అజయ్ సబర్వాల్, డీజీఎం కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యంతో పేవ్మెంట్స్, వంతెనల మౌలిక సదుపాయాలకు సంబంధించి నూతన సాంకేతికత అభివృద్ధిపై విశ్వాసం ఉన్నదన్నారు. ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ (ట్రీ హబ్) కొత్తదని, దేశంలోని ఐఐటీల్లో మొదటిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రీ హబ్, సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ శిరీష్, ప్రొఫెసర్లు సూర్యప్రకాశ్, ఉమాశంకర్, మహేంద్రకుమార్ మాధవన్, డాక్టర్ మున్వర్ భాషా, డాక్టర్ అనిల్ అగర్వాల్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు.