Artificial Intelligence | ఎన్నికల ప్రచారంలో జరిగే ఎలాంటి కార్యక్రమంలోనైనా పాల్గొనే సాధారణ ప్రజల ముఖ కవళికల ఆధారంగా వారి మూడ్ను అంచనా వేసేందుకు టెక్ నిపుణులు సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ముంబై కంప్యూటర్ నిపుణులు చేపట్టిన ఈ ప్రాజెక్టు సమీప భవిష్యత్తులో జరిగే ఎన్నికల ప్రక్రియలో కీలకంగా మారనున్నదని అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే ఈ విధానం త్వరలోనే అందుబాటులోకి రానున్నది.
ఎన్నికలు వచ్చాయంటే ర్యాలీలు, సభలు, వాహనాల శ్రేణితో జరిపే పాదయాత్రలతో అంతా సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే, ఇందులో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల కంటే ప్రచారంలో పాల్గొనే సాధారణ జనాలే ఎక్కువగా ఉంటారు. టీవీల్లో కనిపించే నాయకులను కళ్లారా చూసేందుకు కొందరు వస్తుంటారు.
స్థానిక నేతల ప్రోద్బలంతో సమూహంలో కలిసేవారు మరికొందరు ఉంటారు. ఇలా ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనే జనాల మూడ్ను అంచనా వేసేందుకు ప్రత్యేక టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ.ఐ) ఆధారంగా పనిచేసే విధానం ద్వారా సమావేశాలు, మహాసభలు, ర్యాలీల్లో పాల్గొన్న జనాలు సంబంధిత పార్టీ గురించి ఏమి ఆలోచిస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేలా డిజైన్ చేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ముంబై కంప్యూటర్ నిపుణులు చేపట్టిన ఈ ప్రాజెక్టు రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారనున్నదని టెక్ నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీ పరిధి విస్తరిస్తున్నది. ఇప్పటికే ఏఐ మెషిన్ లెర్నింగ్ ఆధారిత టెక్నాలజీల సాయంతో అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్నది. తాజాగా రాజకీయాల్లోనూ ఈ అధునాతన టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతున్నది. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో ఎన్నికల సందడి నెలకొనడంతో…. ఓవైపు డిజిటల్ మీడియా, మరోవైపు ఏఐ, ఎంఎల్ వంటి టెక్నాలజీతో కూడిన వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిపుణులు కృషి చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఐఐటీ, ముంబై ఐఐటీ టెక్ నిపుణులు ఏఐ ఆధారిత వ్యవస్థను డిజైన్ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఎన్నికల సందర్భంగా జరిగే సభలు, సమావేశాలు, ర్యాలీలు, వాహనాల యాత్రలు, పాదయాత్రల్లో పాల్గొనే జనాల మూడ్ను పసిగట్టేందుకు ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనాలసిస్ టెక్నాలజీని నిపుణులు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా ముఖ కవళికలను బట్టి వారి మానసిక స్థితి, ఆరోగ్య పరిస్థితి, ఆలోచన పరిపక్వత, శారీరక రుగ్మతలను అంచనా వేస్తున్నారు. అలాంటి సమాచారానికి అదనంగా మరికొన్ని అంశాలను జతచేసి జనాల మూడ్, ఆలోచనా ధోరణిని టెక్నాలజీ ద్వారా విశ్లేషించేలా ఏఐని రూపకల్పన చేస్తున్నారు. ఒకసారి సభలు, సమావేశాలకు హాజరైన వారి వీడియోలు, ఫొటోలను ఏఐతో కూడిన అనాలసిస్ వ్యవస్థకు అనుసంధానం చేయగానే వాటిని విశ్లేషించి సంబంధిత కార్యక్రమంపై అభిప్రాయాన్ని హావభావాలు సహా గుర్తించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ తరహా టెక్నాలజీ ప్రయోగ దశలో ఉండగా… త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, దీంతో జనాల మూడ్ను కచ్చితంగా అంచనా వేసేందుకు వీలు కలుగుతుందని ఐఐటీ హైదరాబాద్ టెక్ నిపుణులు భావిస్తున్నారు.
… కడార్ల కిరణ్